వరంగల్, జనవరి 20: నగరాభివృద్ధే ధ్యేయంగా బల్దియా కౌన్సిల్ సమావేశం సాగింది. సమష్టిగా అడుగులు వేయాలన్న సంకేతాన్నిచ్చింది. గురువారం గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన టెలీకాన్ఫరెన్స్ పద్ధతిలో జరిగింది. కమిషనర్ ప్రావీణ్య వింగ్ అధికారులు కార్పొరేషన్లో నుంచి టెలీకాన్ఫరెన్స్లో పాల్గొనగా, మేయర్ తన ఇంటి నుంచి సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఇంటి నుంచే కౌన్సిల్ సమావేశంలో పాల్గొని పలు సమస్యలను లెవనెత్తారు. ఇందులో రూ. 4.85 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం లభించింది. పలువురు కార్పొరేటర్లు డివిజన్ సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అన్నపూర్ణ భోజన క్యాంటిన్లను శంభునిపేట, గీసుగొండ, మడికొండ ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని పలువురు కార్పొరేటర్లు సూచించారు.
సమస్యలపై సమగ్ర చర్చ..
బల్దియా కౌన్సిల్ సమావేశంలో నగర సమస్యలపై సమగ్రంగా చర్చించారు. ఎజెండా అంశాలతోపాటు డివిజన్లలో ఎదురవుతున్న సమస్యలను సభ్యులు కౌన్సిల్లో లెవనెత్తారు. మిషన్ భగీరథ పైపులైన్ పనులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. కుక్కలు, కోతుల బెడదతో ప్రజలు అవస్థలు పడుతున్నారని కార్పొరేటర్లు తెలిపారు. కొత్తగా నియమించిన 452 మంది పారిశుధ్య కార్మికుల వివరాలతోపాటు వారు ఏయే డివిజన్లో పని చేస్తున్నారనే సమగ్ర వివరాలను అందజేయాలని డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ కోరారు. అమ్మవారిపేట గట్టమ్మ నుంచి అమ్మవారిపేట గ్రామం వరకు రూ. 1.99 కోట్లతో చేపట్టనున్న రోడ్డు అక్కడ ఉన్న రెడిమిక్స్ ప్లాంట్ల భారీ వాహనాలతో దెబ్బతినే అవకాశం ఉందని 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు. రెడిమిక్స్ ప్లాంట్ల యాజమాన్యాల నుంచి కాంట్రిబూషన్ వసూలు చేసేలా ఆలోచన చేయాలన్నారు. దినసరి కూలీలుగా అర్బన్ మలేరియా విభాగంలో పని చేస్తున్న 90 మంది కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. భవన నిర్మాణ, అసంఘటిత రంగాల కార్మికుల అడ్డా ఉన్న శంభునిపేట సెంటర్లో అన్నపూర్ణ పథకం ద్వారా ఐదు రూపాలయ భోజన సెంటర్ను ఏర్పాటు చేయాలని 42వ డివిజన్ కార్పొరేటర్ గుండు చందన కోరారు. డివిజన్లోని 12 కూడళ్లలో మినీ హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. సభ్యులు లెవనెత్తిన సమస్యలపై కమిషనర్ ప్రావీణ్యతోపాటు వింగ్ అధికారులు సమాధానం చెప్పారు.
ఔట్ సోర్సింగ్ కార్మికులకు నజరానా
ఔట్ సోర్సింగ్ ఉద్యోగ, కార్మికులకు బల్దియా కౌన్సిల్ సమావేశం నజరానా ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కార్మికుల వేతనాలను 30 శాతం పెంచుతూ కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతోపాటు అర్బన్ మలేరియా కార్మికుల దినసరి వేతనాన్ని రోజుకు రూ. 427గా ఏడాది కాలం వేతనాల చెల్లింపునకు సభ ఆమోదం తెలిపింది. కార్పొరేషన్లో హోం కంపోస్టింగ్ సెల్ ఏర్పాటు చేయాలన్న అంశానికి కౌన్సిల్ ఆమోద ముద్ర వేసింది.
మూడు గంటలపాటు కౌన్సిల్
బల్దియా కౌన్సిల్ సమావేశం సుదీర్ఘంగా మూడు గంటలపాటు సాగింది. ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం కల్పించారు. అన్ని పార్టీలకు చెందిన కార్పొరేటర్లు డివిజన్ సమస్యలపై మాట్లాడారు. ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి కౌన్సిల్కు దిశానిర్దేశం చేశారు. తమ నియోజవర్గాల పరిధిలోని డివిజన్ల సమస్యలను ప్రస్తావించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత వింగ్ అధికారులు సమాధానం చెప్పారు.
పెండింగ్ పనులు పూర్తి చేయాలి
పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగతిన పూర్తి చేయాలి. గత కౌన్సిల్లో మంజూరైన పనులకు వెంటనే టెండర్లు పిలిచి ప్రారంభించాలి. గొర్రెకుంట ప్రాంతంలోని బీట్బజార్ మార్కెట్ను ఫిబ్రవరిలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. ఆలోగా మౌలిక వసతులు కల్పించాలి. పరకాల నియోజవర్గంలోని డివిజన్లలో మరో 10 మంది పారిశుధ్య కార్మికులను కేటాయించాలి.