ఖిలావరంగల్, ఫిబ్రవరి 13 : ప్రతి ఒక్కరూ వృథా ఖర్చులు తగ్గించుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్లో ఆర్బీఐ ఆర్థిక అక్షరాస్యతా వారోత్సవాల్లో భాగంగా లీడ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన 2కే వాకథాన్ను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 17 వరకు జిల్లాలోని అన్ని బ్యాంకుల ద్వారా ఆర్థిక అక్షరాస్యతా క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. బ్యాంకుల ద్వారా నిమిషాల వ్యవధిలో రుణాలను పొందవచ్చన్నారు. సైబర్ నేరస్తుల నుంచి అప్రమత్తంగా ఉండాలన్నారు. బ్యాంక్ లావా దేవీల విషయంలో బ్యాంక్ అధికారులను మాత్రమే సంప్రదించాలని సూచించారు. ఒక వేళ సైబర్ క్రైం జరిగితే 1930 లేదా 14448 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో యూబీఐ డిప్యూటీ ఆర్ఎం వజీర్సుల్తాన్, కెనరా బ్యాంక్ ఆర్ఎం మాధవి, శ్రీనివాస్, డీసీసీబీ ఏజీఎం రాజశేఖర్ పాల్గొన్నారు.
ప్రజావాణికి 67 దరఖాస్తులు
ఖిలావరంగల్ : కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో పలువురు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ బీ గోపికి దరఖాస్తులు అందజేశారు. చెన్నారావుపేట సహకార సంఘంలో అక్రమాలు జరుగుతున్నాయని, గుంట భూమి లేనివారికి సభ్యత్వంతో పాటు రుణాలు ఇచ్చారని రైతు మన్నెం వీరేందర్రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని గతంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని దరఖాస్తులో పేర్కొన్నారు. వారసత్వంగా వస్తున్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిని తన పేరుపై పట్టా చేయాలని నల్లబెల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన డీ ఉమ వినతిపత్రం అందజేసింది. తన భర్త పేరుపై ఉన్న కారు రిజిస్ట్రేషన్ను తన పేరుపై మార్చాలని కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కుసుమ స్వప్న విన్నవించింది. తన భర్త గత ఏడాది మృతి చెందాడని, కారు రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ కోసం ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇప్పించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్లోని 3వ డివిజన్ ఆరెపల్లి శివారులో 577లో తాము కొన్న భూమిలో సర్వేను అడ్డుకుంటున్న వారిని కట్టడి చేసి భూమికి హద్దులు నిర్ణయించుకునే విధంగా చూడాలని దయ్యాల వేణుకుమార్ వినతిపత్రం అందజేశారు. కాగా, గ్రీవెన్స్కు మొత్తం 67 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు లబ్ధిదారులకు సత్వర న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, అధికారులు పాల్గొన్నారు.