మహబూబాబాద్ రూరల్, ఫిబ్రవరి 13 : సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిరంత రం, ప్రామాణికమైన విద్యుత్ను అందిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చై ర్మన్ (టీఎస్ఈఆర్సీ) తన్నీరు శ్రీ రంగారావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్హాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి విద్యుత్ వినియోగదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరంగారావు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోతలతో ప్రజలు అష్టకష్టాలు పడినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కరెంటు కష్టాలు ఉండొద్దనే సంకల్పంతో సీఎం కేసీఆర్ వేల కోట్లు ఖర్చుపెట్టి, అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రం లో ఎక్కడా కరెంటు కోతలు, పవర్ హాలీడేలు లేవన్నారు. నిరంతరం నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర సర్కారు కేవలం విద్యుత్ రంగంపైనే రూ.58 వేల కోట్లు ఖర్చు చేసి మౌలిక సదుపాయాలు కల్పించిందన్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల క్వాలిటీ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలను, వైర్లను ఏర్పాటు చేసిందన్నారు. ఈ ఏడాది కూడా ప్రభుత్వం విద్యుత్ అవసరాల కోసం మరో రూ.48 వేల కోట్లు కేటాయించిందన్నారు. ప్రజలు విద్యుత్ను దుర్వినియోగం చేయకుండా పొదుపుగా వాడుకోవాలన్నారు. గృహ వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లిస్తే సంస్థకు మరింత లాభం చేకూరుతుందన్నారు. జిల్లా, మండలం, గ్రామాల్లో కరెంటు సమస్యలుంటే విద్యుత్ వినియోగదారుల ఫోరంలో రాత పూర్వకంగా ఫిర్యా దు చేస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. వాట్సాప్, ఆన్లైన్ ద్వారా కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా అనేక రకాల విద్యుత్ సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు.
తొర్రూరు జడ్పీటీసీ మంగళంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీ విద్యుత్ను అందజేస్తున్నదన్నారు. జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మహబూబ్ పాషా మాట్లాడు తూ.. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం వినియోగదారుల ఫోరం అనే చక్కని వేదికను తీసుకొచ్చిందన్నారు. పట్టణ ప్రాంతంలో గృహ నిర్మాణదారులకు మున్సిపాలిటీ పర్మిషన్ ఉంటేనే మీటర్ అనుమతి ఇస్తున్నారని, ఈ విధానాన్ని సవరిస్తే చాలామందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో మెంబర్ ఆఫ్ టెక్నికల్ మనోహర్రాజు, మెంబర్ ఆఫ్ ఫైనాన్స్ బండారు కృష్ణయ్య, డైరెక్టర్లు గణపతి, మెహన్రెడ్డి, లక్ష్మణ్, సత్యనారాయణ, తిరుమలరావు, చరణ్దాస్ పాల్గొన్నారు.