జయశంకర్ భూపాలపల్లి, జనవరి 1 (నమస్తే తెలంగాణ): ఇష్టారాజ్యంగా కరెంట్ కోతలు. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియదు. గంటల తరబడి ఎదురుచూసినా రాకపోవుడు, ఒకవేళ కరెంట్ రాగానే మోటర్ ఆన్ చేద్దామని బావి వద్దకు వెళ్లేసరికి పోవుడు. కరెంట్ సక్రమంగా లేక పారిన దొయ్యే పారేది. అధిక లోడ్తో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు తరచూ కాలిపోయేవి. ఇదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు పరిస్థితి. ఆరు గంటల కరెంట్ కూడా సక్రమంగా రాక రైతులు అరిగోస పడేవారు. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ సరఫరాను పూర్తిగా మెరుగు పరిచింది. అదనపు విద్యుత్ లైన్లు, సబ్స్టేషన్లు నిర్మించడంతోపాటు ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతులకు ఇతర ఇబ్బందులేవీ లేకుండా చర్యలు తీసుకుంది. 2018 నుంచి వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంట్ను విజయవంతంగా అమలు చేస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1,62,728 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, అందులో 43,200 వ్యవసాయ విద్యుత్ మోటర్ కనెక్షన్లు గల రైతులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతోంది. విద్యుత్ నిరంతర సరఫరాతో పడావు పడ్డ భూములు కూడా సాగులోకి వస్తుండగా రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
తెలంగాణ ఉద్యమ రథసారథిగా రైతుల కష్టాలను కళ్లారా చూసిన కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నేతృత్వంలో సీఎం అయ్యాక సంక్షేమ పథకాలతో వారి కష్టాలన్నింటినీ దూరం చేస్తుండడంతో వ్యవసాయం పండుగ అయ్యింది. అందులో భాగంగా 2018 జనవరి 1 నుంచి దేశంలోనే ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంట్ను విజయవంతంగా అమలు చేస్తున్నారు. కరెంట్ కోసం రైతులు పడ్డ కష్టాలన్నీ పూర్తిగా కనుమరుగయ్యాయి. జిల్లాలో సాగు విస్తీర్ణం కూడా గతంలో కంటే గణనీయంగా పెరిగింది.
జిల్లాలో 43,200 మందికి ప్రయోజనం
సీఎం కేసీఆర్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్తో జిల్లాలో 43,200 మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. దీంతో పడావు పడ్డ భూములు సాగులోకి వచ్చాయి. జిల్లాలో మొత్తం 1,62,728 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, ఇందులో 43,200 వ్యవసాయ విద్యుత్ మోటర్ కనెక్షన్లు ఉన్నాయి.
11,330 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు
జిల్లాలో వ్యవసాయ, గృహ, వ్యాపార సంస్థలకు విద్యుత్ సరఫరా చేస్తున్న ట్రాన్స్ఫార్మర్లు 11,330 ఉన్నాయి. అందులో త్రీఫేస్, 4,270 సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్లు. 11కేవీ ఫీడర్స్ 185 ఉండగా, విద్యుత్ లైన్లు 7071.80 కిలోమీటర్లు. 33కేవీ ఫీడర్స్ 22 ఉండగా, విద్యుత్ లైన్లు 443.28 కిలోమీటర్లు, ఎల్టీ విద్యుత్ లైన్లు 7,075.50 కిలోమీటర్లు, 6.3 కేవీ విద్యుత్ లైన్లు 4,269 కిలోమీటర్లు ఉన్నాయి. వీటి ద్వారా జిల్లాలో మెరుగైన విద్యుత్ సరఫరా జరుగు తున్నది. ఇందులో అధికసంఖ్యలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్ల నిర్మాణం స్వరాష్ట్రంలోనే జరిగాయి.
స్వరాష్ట్రంలో ఏడు సబ్ స్టేషన్ల నిర్మాణం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ సరఫరాను మెరుగుపరచడంపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. అందులో భాగంగా భూపాలపల్లి మండలం గొల్లబుద్దారం, వజినపల్లి, చిట్యాల మండలం చల్లగరిగ, టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి(బి), గణపురం మండలం కొండాపూర్, మల్హర్ మండలం రుద్రారం గ్రామాల్లో విద్యుత్ సబ్స్టేషన్లను నిర్మించింది. ఇవేకాకుండా అప్పటికే జిల్లాలో ఉన్న పాత విద్యుత్ సబ్స్టేషన్లలో 5ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ ఒకటి మాత్రమే ఉండేవి. ఇప్పుడు విద్యుత్ స్టేషన్లలో అదనంగా మరో 5ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ను ప్రభుత్వం అమర్చింది. ఇలా పాత విద్యుత్ సబ్స్టేషన్లలో అదనంగా 5ఎంవీఏ సామర్థ్యం గల మరో ట్రాన్స్ఫార్మర్ను అమర్చి, కొత్త విద్యుత్ సబ్స్టేషన్లను నెలకొల్పడంతో జిల్లాలో విద్యుత్ సరఫరా గణనీయంగా మెరుగు పడింది. అవసరమైన చోట నూతనంగా విద్యుత్ లైన్లను, పాత వాటి మరమ్మతులు చేసింది. దీంతో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు సరఫరా చేయడంలో తెలంగాణ సర్కార్ సక్సెస్ అయ్యింది.
కొత్తగా మూడు మరమ్మతు కేంద్రాలు
జిల్లాలో గతంలో కాటారం మండల కేంద్రంలో మాత్రమే విద్యుత్ మరమ్మతు కేంద్రం ఉండేది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత భూపాలపల్లి నియోజక వర్గానికి వచ్చిన సీఎం కేసీఆర్ భూపాలపల్లి మండల జంగేడు, రేగొండ, చిట్యాల మండల కేంద్రాల్లో విద్యుత్ మరమ్మతు కేంద్రాలు మంజూరు ఇప్పుడు వాటిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, ఇతర పరికరాలను మరమ్మతు చేస్తున్నారు. గతంలో ఓవర్ లోడ్తో పెద్ద సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవి. వాటిని బాగు చేయడానికి నాటి ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం అరుదు. ఏదైనా రిపేర్ వస్తే జిల్లాలోని కేంద్రాల్లోని ఎన్పీడీసీఎల్ సిబ్బంది చేస్తున్నారు. రిపేర్ త్వరగా చేస్తుండడంతో సత్వరమే అమర్చి విద్యుత్ పునరుద్ధరిస్తున్నారు. దీంతో రైతులు రోజుల తరబడి వేచి చూసే పరిస్థితి లేకుండా పోయింది.
రైతులకు ఎంతో ప్రయోజనం
రాష్ట్రం ఏర్పడక ముందు వ్యవసాయానికి విడుతల వారీగా ఇచ్చే కరెంటుతో రైతులు చాలా ఇబ్బంది పడేవారు. లో ఓల్టేజీ సమస్య ఎక్కువగా ఉండేది. విద్యుత్ మోటర్లు తరుచూ కాలిపోయేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర సీఎం కేసీఆర్ విద్యుత్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగు పరిచారు. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాతో రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. జిల్లాలో రేగొండ మండలం పాండవులగుట్ట (తిరుమలగిరి), గణపురం మండలం చెల్పూర్లో కొత్తగా విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం కొనసాగుతున్నది. రేగొండ మండలం చెన్నాపూర్, చిట్యాల మండలం నైన్పాక గ్రామాల్లో విద్యుత్ సబ్స్టేషన్లు కొత్తవి మంజూరయ్యాయి. టెండర్ ప్రక్రియలో ఉంది. డిసెంబర్ నెలలో జిల్లాలో మొత్తం విద్యుత్ డిమాండ్ 168.436 మిలియన్ యూనిట్(ఎంయూ)గా ఉంది.
– మల్చూర్ నాయక్,ఎస్ఈ, ఎన్పీడీసీఎల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
మోటార్ కాడికి పోతే పాములు, తేళ్లు కుట్టేవి
తెలంగాణ రాక ముందు కరెంటు కోసం చాలా గోస పడ్డాం. కరెంటు సక్కగా రాకపోయేది. మోటర్ వేయడానికి రాత్రిపూట పోయేటోళ్లం. పాములు, తేళ్లు కుట్టేవి. లోవోల్టేజీ కరెంటుతో ఒకటి రెండుసార్లు మోటర్ కాలిపోయేది. మంచిగ చేయించాలంటే రూ.3వేలు అయ్యేది. ఇప్పుడు ఆ తిప్పలు తప్పాయి. కరెంటు ఇప్పుడు మంచిగా వత్తాంది. ఎప్పుడు పడితే అప్పుడు మోటరేసుకొని పొలానికి నీళ్లు పెట్టుకుంటున్నా.
– మామిండ్ల శ్రీనివాస్, రైతు, వజినపల్లి, భూపాలపల్లి మండలం
రాత్రుళ్లు నీళ్లు కట్టె గోస తప్పింది
చిట్యాల: నేను 5 భూమి ఉంది. నాలుగెకరాల పత్తి, ఎకరం మిర్చి పెట్టిన. నిరంతర విద్యుత్ వల్ల లాభసాటి వ్యవసాయం చేస్తున్నా. పరిస్థితులు అనుకూలించడం, 24గంటల కరెంట్, పుష్కలంగా నీటితో కూడిన బోరు, రైతుబంధు పెట్టుబడి సాయం అందడం వల్ల మరో రెండెకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి రెండు సార్లు సాగు చేస్తున్నా. తెలంగాణలో ఉచితంగా ఇస్తున్న కరెంట్తో వానకాలం పత్తి, మిర్చి, మొక్కజొన్న, యాసంగిలో వరి సాగు చేసుకుంటున్నాం.
– మర్రి ఐలయ్య, ఏలేటి రామయ్యపల్లి, చిట్యాల, జయశంకర్ జిల్లా