‘ఏరువాక’ పండుగ లేదా ‘హలపౌర్ణమి’గా భారతీయులు జ్యేష్ఠ పూర్ణిమను జరుపుకొంటారు. నాగరికత ఎంత ముందుకు సాగినా ప్రజలకు రైతు, నాగలి లేనిదే పూట గడవదు. సాగుకు సంబంధించిన అతిముఖ్యమైన వేడుక ఈ ‘ఏరువాక’.
ఇప్పటికి తొలకరి వర్షం కురుస్తుంది కనుక నాగలితో సాగే వ్యవసాయ పనులకు శుభారంభమిది. ఇవి ఎవరికివారు వీలైనప్పుడు మొదలుపెడితే ఫలితాలుకూడా తారుమారవుతాయి. కనుక, ఆ వేళ రైతులు వ్యవసాయ పనిముట్లను శుభ్రం చేసుకొని, వాటిని పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ఎడ్లకు స్నానం చేయించి, కొమ్ములకు రంగులు పూసి, మెడలో గంటలు, కాళ్ళకు గజ్జెలు కట్టి పసుపు కుంకుమలతో పూజించి హారతి పడతారు. ‘పొంగలి ప్రసాదం’ నైవేద్యంగా పెట్టి వాటికి తినిపిస్తారు. ఆ మూగజీవాలపట్ల తమ అనుబంధాన్ని రైతన్నలు ఇలా తెలియజేస్తారు.
దీనిని ‘జేష్ఠ పౌర్ణమినాడే ఎందుకు జరుపుకోవాలి?’ అంటే, ఈవేళ పదహారు కళలతో చంద్రుడు వెలుగొందుతాడు. భూమిలో ఎక్కడైతే ఔషధాలు, భూసారం, శక్తి ఉంటాయో అక్కడికి ‘వెన్నెల కిరణాలు’ వెళ్లి లోపలి మొక్కకు వాటిని అందిస్తాయి. ఏరువాక, నాగలి పాటలకు మన జానపద సాహిత్యంలో ఒక విశిష్టస్థానం ఉంది. మన దేశంలో వేదకాలంలోనూ ఈ పండుగ ఆచరణలో ఉంది. గోపాలకులకు ‘గిరియజ్ఞం’, బ్రాహ్మణులకు ‘మంత్రజప యజ్ఞం’, కర్షకులకు ‘ఏరువాక యజ్ఞం’ ఆచరణీయమని ‘విష్ణుపురాణం’ పేర్కొంది. సాగుకు మూలమైన ఎద్దును దైవసమానంగా భావించిన పరమేశ్వరుడు దానినే తన వాహనంగా చేసుకొన్నాడు కదా.
వేముగంటి శుక్తిమతి
99081 10937