వరంగల్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కి మన రాష్ట్రంలోని ప్రాజెక్టులను అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ నెల 13న నల్లగొండలో బీఆర్ఎస్ తలపెట్టిన బహిరంగసభకు ఉమ్మడి జిల్లా నుంచి 20 వేల మందిని తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ సాగునీటి ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేస్తూ బీఆర్ఎస్ ఈ బహిరంగసభను నిర్వహిస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కార్యకర్తలు, ముఖ్యనాయకులు తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, ముఖ్యనేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాగునీటి రంగంలో తెలంగాణకు అన్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నల్లగొండ బహిరంగసభకు జన సమీకరణ చేయాలని ఆదేశించారు. నల్లగొండ ఉమ్మడి జిల్లా సరిహద్దులో ఉన్న పాలకుర్తి, జనగామ, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాల నుంచి ఎక్కువ మంది, మిగిలిన నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, ముఖ్య నేతలు సభకు తరలివెళ్లేలా వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్భాస్కర్, అరూరి రమేశ్, మాలోత్ కవిత, గండ్ర జ్యోతి, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిల ఆధ్వర్యంలో జనాన్ని తరలించనున్నారు.
సభకు భారీగా తరలిరావాలి: మాజీ మంత్రి ఎర్రబెల్లి
నల్లగొండలో బీఆర్ఎస్ నిర్వహించనున్న బహిరంగ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి భారీ సంఖ్యలో జనం తరలి రావాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా నుంచి 20 వేల మంది వరకు వెళ్లనున్నారని చెప్పారు. పాలకుర్తి, జనగామ, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల నుంచి నాలుగు వేల మంది చొప్పున, మిగిలిన నియోజకవర్గాల నుంచి వెయ్యి మందికి తగ్గకుండా ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, ముఖ్య నేతలు హాజరవుతారని తెలిపారు.