కరీమాబాద్, జనవరి 20 : బాలిక కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. శుక్రవారం కిరాణా షాపునకు వెళ్లిన బాలిక కిడ్నాప్ కావడం కొద్దిసేపటి తర్వాత తప్పించుకుని ఇంటికి రావడం చర్చనీయశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కరీమాబాద్ కాశీకుంటకు చెందిన సుమారు 12 ఏళ్ల చిన్నారి సరుకులు తెచ్చేందుకు జన్మభూమి జంక్షన్ రోడ్డులోని ఓ కిరాణా షాపునకు వెళ్లింది. దాదాపు గంట దాటినా బాలిక ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టపక్కల వెతకగా, ఎక్కడా కనిపించలేదు. కాగా, కొద్ది సేపటి తర్వాత తెలిసిన వారు బాలికను ఇంటికి తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
బాలికను విషయం అడుగగా కొందరు వ్యక్తులు ఆటోలో వచ్చి తనను తీసుకువెళ్లారని, ఉర్సు బైపాస్ రోడ్డులోని ఓ కళాశాల వద్ద ఆటోలో నుంచి దూకి తప్పించుకున్నానని చెప్పింది. అక్కడ తెలిసిన వారు ఇంటికి తీసుకువచ్చారని వివరించింది. ఘటనపై కుటుంబ సభ్యులుమిల్స్కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ కాలనీలో జరిగిన కిడ్నాప్ వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలం సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. బాలికతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. బాలికను తీసుకువెళ్లింది కిడ్నాప్ ముఠా వారా? లేక బాలిక కుటుంబ సభ్యులకు తెలిసిన వారా? పాత కక్షలు, కుటుంబ కలహాలు తదితర అంశాలపై ఆరా తీస్తున్నారు.