నెక్కొండ, ఆగస్టు 2 : ప్రమాదవశాత్తు ఆదివారం సాయంత్రం బావిలో పడిన ట్రాక్టర్, డ్రైవర్ను 12 గంటల తర్వాత బయటికి తీశారు. ఈ ఘటన మండలంలోని గొల్లపల్లిలో ఆదివారం సాయంత్రం జరిగింది. పోలీసు లు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నెక్కొండ మండలం చంద్రయ్యపల్లెకు చెందిన వాటర్మన్ రజనీకాంత్ (32) గొల్లపెల్లిలో దుక్కి దున్నేందుకు వెళ్లాడు. దున్నుతున్న క్రమంలో ట్రాక్టర్తో సహా బావిలో పడిపోయాడు. గమనించిన స్థానికులు విషయాన్ని పోలీసులకు తెలిపారు. నర్సంపేట ఏసీపీ ఫణీంద్ర ఆధ్వర్యంలో నెక్కొండ, నర్సంపేట డీఎస్పీలు తిరుమల్, కరుణసాగర్రెడ్డి, నెక్కొండ, చెన్నారావుపేట ఎస్సైలు నాగరాజు, రవితో పాటు నెక్కొండ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మూడు మోటర్లు ఏర్పా టు చేసి బావి నుంచి నీటిని తోడారు. సుమారు 12 గంటల తర్వాత సోమవారం ఉదయం ఆరు గంటలకు ట్రాక్టర్, మృతదేహాన్ని వెలికితీశారు. పంచనామా అనంతరం మృత దేహా న్ని పోస్టుమార్టం కోసం నర్సంపేటకు తరలించినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.
మృతుడి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి
నెక్కొండ మండలం గొల్లపెల్లిలో దుక్కిదున్ను తూ ట్రాక్టర్తో సహా బావిలో పడి మృతి చెందిన చంద్రయ్యపల్లెకు చెందిన వాటర్మన్ రజినీకాంత్(32) కుటుంబాన్ని ఆదుకోవాలని నర్సంపేట పోలీసు స్టేషన్ ఎదుట రోడ్డుపై సోమవారం సాయంత్రం రాస్తారోకో చేశారు. అతడిని దుక్కి దున్నడానికి తీసుకెళ్లిన వ్యక్తి రాజు ను శిక్షించాలని కోరారు.విషయం తెలుసుకున్న ఏసీపీలు ఫణిందర్, కరుణసాగర్రెడ్డి, ఎస్సై రాంచరణ్ పలు దఫాలుగా ఆందోళన కారులతో చర్చలు జరిపారు. అయి నా, వారు ఆందోళన విరమించలేదు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారని, పెద్ద కూతురు మానసిక దివ్యాంగురాలని వారిని ఆదుకోవాలని కోరారు.