నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 6 : అభయహస్తం ‘ప్రజాపాలన గ్రామ సభలు’ ఉమ్మడి జిల్లాలో శనివారం ముగిశాయి. ‘ఆరు గ్యారెంటీల’ కోసం మొత్తంగా 11,90,737 దరఖాస్తులు ప్రజల నుంచి వచ్చినట్లు అధికారయంత్రాంగం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 28న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా ఇప్పటివరకు దరఖాస్తులు ఇవ్వనివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సోమవారం నుంచి ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల్లో ఇచ్చే వెసులుబాటు ఉంటుందని సర్కారు ప్రకటించింది. కాగా ఈ నెల 17లోగా ఆన్లైన్లో దరఖాస్తుల నమోదు ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారయంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఆరు గ్యారెంటీల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోనివారు ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల్లో ఇవ్వవచ్చని ప్రభుత్వం తెలిపింది.
అత్యధికంగా వరంగల్ జిల్లాలో 2,88,176 దరఖాస్తులు వచ్చాయి. పది రోజుల్లో మొదటి రెండు మూడు రోజులు, చివరి రోజుల్లో ప్రజలు భారీగా దరఖాస్తులు ఇచ్చారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని గ్రామాల్లో ఒకరోజు చొప్పున, పట్టణాల్లోని వార్డులు, నగరాల్లోని డివిజన్లలో ఎనిమిది రోజులపాటు నిర్వహించారు. గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించిన ప్రభుత్వం అభయహస్తం పేరుతో ఐదు పథకాల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. మహాలక్ష్మీ, ఇందిరమ్మ ఇండ్లతో పాటు కొత్త రేషన్కార్డుల కోసం ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను అధికారులు ప్రత్యేక సాఫ్ట్వేర్లోకి అప్లోడ్ చేస్తున్నారు. ఈనెల 17లోపు దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ పూర్తి కానున్నది. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డేటా ఎంట్రీ పూర్తయిన తర్వాత లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో మొత్తం 2,39,424 కుటుంబాలకు గాను 2,17,224 కుటుంబాల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్న 174 గ్రామ పంచాయతీల్లో 1,09,669 దరఖాస్తులు వచ్చాయి. హనుమకొండ జిల్లాలో 2,50,367 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1,46,458, జనగామ జిల్లాలో 1,78,843 అర్జీలు వచ్చినట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు.
జిల్లా దరఖాస్తులు