వర్ధన్నపేట, జనవరి 29 : మెరుగైన ప్రసూతి వైద్య సేవలకు కేరాఫ్గా వర్ధన్నపేట కమ్యూనిటీ హెల్త్
సెంటర్ నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సీహెచ్సీలో అన్ని వసతులు కల్పించడంతోపాటు అనుభవం, అర్హతలు ఉన్న వైద్యులను నియమించింది. దీంతో వర్ధన్నపేట నుంచే కాకుండా మానుకోట, జనగామ జిల్లాల నుంచి కూడా మహిళలు డెలివరీలు, నెల వారీ పరీక్షల కోసం ఇక్కడకు వస్తున్నారు. గర్భిణులు ప్రసూతి వైద్యసేవలు పొందుతూ కేసీఆర్ కిట్ తదితర ప్రోత్సాహకాలను కూడా అందుకుంటున్నారు. ఆడబిడ్డ పుడితే ఆర్థిక సాయం కూడా అందిస్తున్నారు. 2022లో ఈ దవాఖానలో 1,185 మందికి వైద్యులు ప్రసవం చేశారు. గర్భిణులను దవాఖానకు తీసుకురావడం, ప్రసవం తర్వాత తల్లీబిడ్డలను అమ్మఒడి వాహనాల్లో క్షేమంగా ఇండ్లకు చేర్చుతున్నారు. అదేవిధంగా 301 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, 36,913 మందికి ఓపీ పరీక్షలు చేయడంతోపాటు 18 సదరం క్యాంపులు నిర్వహించారు.
ప్రసూతి వైద్యంలో వర్ధన్నపేట కమ్యూనిటీ హెల్త్సెంటర్ టాప్లో నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం దవాఖానలో మెరుగైన వసతులు, అ నుభవం, అన్ని అర్హతలు కలిగిన వైద్యులను నియమించడంతో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. చుట్టు పక్కల మండలాల నుంచే కాకుండా మహబూబాబాద్, జనగామ జిల్లాలకు చెందిన మహిళలు కూడా వర్ధన్నపేట ప్రభుత్వ దవాఖానకు వచ్చి ప్ర సూతి వైద్యం చేయించుకుంటున్నారు. సాధారణ ప్ర సవాలకే వైద్యులు ప్రాధాన్యమిస్తున్నప్పటికీ సెక్షన్లు కూ డా పెద్దసంఖ్యలో జరుగుతున్నాయి. ప్రసూతి కోసం ప్రైవేట్ దవాఖానకు వెళ్తే రూ.60వేలకు పైగా ఖర్చు అ వుతున్నది. ప్రభుత్వ హాస్పిటల్లో ఉచితంగా వైద్య పరీక్షలు అందించి ఆడబిడ్డ పుడితే ఆర్థికసాయంతో పాటు కేసీఆర్ కిట్టును కూడా అందిస్తూ పేద కుటుంబాలకు ప్రభుత్వం చేయూతనిస్తున్నది. 2022 సంవత్సరంలో 1,185 మంది మహిళలు ప్రసూతి వైద్యం చేయించుకొని బిడ్డలతో సంతోషంగా ఇళ్లకు చేరుకున్నారు.
సీహెచ్సీలో 1,185 ప్రసవాలు..
ఈ ఏడాది వర్ధన్నపేట సీహెచ్సీలో 1,185 ప్రసవాలు చేశారు. ఇందులో 371 సాధారణ ప్రసవాలు, 814 సిజేరియన్లు జరిగాయి. ఈ ఏడాది జనవరిలో 76, ఫిబ్రవరిలో 76, మార్చిలో 112, ఏప్రిల్ 109, మేలో 67, జూన్లో 88, జూలైలో 74, ఆగస్టులో 106, సెప్టెంబర్లో 120, అక్టోబర్లో 120, నవంబర్లో 124, డిసెంబర్లో 101 ప్రసవాలు జరిగాయి. 2014కు ముందు వర్ధన్నపేట సీహెచ్సీలో నెలకు ఒకటి, రెండు ప్రసవాలు జరగడమే కష్టంగా ఉండేది. కానీ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చేలా ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వసతులు కల్పించారు. గర్భిణులను దవాఖానకు తీసుకురావడం, ప్రసూతి తర్వాత తల్లీబిడ్డను క్షేమంగా అమ్మ ఒడి వాహనాల్లో ఇళ్లకు చేర్చుతున్నారు.
301 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు..
దవాఖానలో కేవలం ప్రసూతి వైద్యమే కాకుండా సాధారణ వైద్య పరీక్షలు కూడా క్రమంగా మెరుగవుతున్నాయి. 2022 సంవత్సరంలో 36,913 మందికి ఓపీ పరీక్షలు నిర్వహించగా, 5,774 మంది ఇన్పేషెంట్లకు వైద్య పరీక్షలు అందించారు. ప్రధానంగా వైరల్ జ్వరాలు, రక్తహీనత, కుక్కకాటు, మంకీబైట్ కేసులతో పాటు షుగర్, బీపీ, ఆస్టియో ఆర్థరైటిస్, సెల్యులైటిస్ తదితర వ్యాధిగ్రస్తులకు సేవలందించారు. 2022 సంవత్సరంలో 13,755 బీపీ కేసులు, 5,381 షుగర్ కేసులు నమోదయ్యాయి. వీరందరికీ ప్రభుత్వం ఉచితంగా మందులను అందిస్తున్నది.
18 సదరం క్యాంపుల నిర్వహణ..
వర్ధన్నపేట సీహెచ్సీలో 18 సదరం క్యాంపులను నిర్వహించారు. 722 మందికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. 551 మందికి వైద్యులు సర్టిఫికెట్లను జారీ చేశారు. ప్రసూతి వైద్యం చేసుకున్న 979 మంది మహిళలకు ఆరోగ్యరక్ష కిట్లను వైద్యులు అందించారు. అంతేకాక దవాఖానలో 301 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. పలుమార్లు ఇక్కడి వైద్యులు అవార్డులు అందుకున్నారు. ఇటీవల జరిగిన గణతంత్ర వేడుకల్లో సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింహస్వామి ఉత్తమ వైద్యుడిగా అవార్డు అందుకున్నాడు.
పేదోళ్లకు ఎంతో మేలు జరుగుతాంది..– సరస్వతి, రాయపర్తి
ప్రైవేట్ దవాఖానల ప్ర సూతి చేయించుకుంటె చా నా ఖర్చయ్యేది. మాది పేద కుటుంబం. వర్ధన్నపేట ద వాఖానల డాక్టర్లు మంచిగ ఉన్నరంటే ఇక్కడికి వచ్చిన. నాకు బిడ్డ పుట్టింది. మా ఇంట్ల అందరు సంతోష పడుతాండ్లు. కేసీఆర్ కిట్టు కూడా ఇచ్చిండ్లు. నా బిడ్డకు రూ.12వేలు కూడా వస్తయట. పెద్ద ఖర్చు తప్పినట్లయింది. దవాఖాన శుభ్రంగ ఉంటాంది. నా కుటుంబానికి ప్రభుత్వం పెద్ద సాయం చేసింది. కేసీఆర్ సార్ సల్లగుండాలె.
ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది..
– డాక్టర్ సోమశేఖర్, గైనకాలజిస్ట్
గతంలోకంటే వర్ధన్నపేట సీహెచ్సీలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతిరోజూ 20 మం దికి నెలవారీ పరీక్షలు చేస్తున్నాం. అవసరమైన మహిళలకు మందులు ఉచితంగా ఇవ్వడంతో పాటు గర్భస్త శిశువుల ఆరోగ్య పరిస్థిత ని స్కానింగ్ ద్వారా తెలుసుకుంటున్నాం. సాధారణ ప్రసవాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ ఇ బ్బందిగా ఉంటే ఆపరేషన్లు కూడా చేస్తున్నాం. బిడ్డలకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే వరంగల్ ఎంజీఎం, ఇతర పిల్లల దవాఖానకు పంపించిన మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నాం.
మల్టీ స్పెషాలిటీ దవాఖానగా సీహెచ్సీ..
– డాక్టర్ నర్సింహస్వామి, సూపరింటెండెంట్
వర్ధన్నపేట సీహెచ్సీని మల్టీ స్పెషాలిటీ దవాఖా నగా మార్చేందుకు ఎమ్మె ల్యే అరూరి రమేశ్ కృషి చే స్తున్నారు. ప్రసూతి వైద్యం ఇతర హాస్పిటళ్ల కంటే మె రుగ్గా అందుతున్నది. త్వరలోనే ప్రభుత్వం 100 పడకల దవాఖానగా మా ర్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం మరో అంతస్తు నిర్మాణం కూడా జరుగుతున్నది. ప్రభుత్వం నుంచి అవసరమైన అధునాతన పరికరాలను ఉన్నతాధికారులు అందిస్తున్నారు.