పేదలు, కార్మికుల ఆత్మబంధువు సీఎం కేసీఆర్ అని, వాళ్ల గురించి ఆలోచించేది ఆయన ఒక్కరేనని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రభుత్వ చీఫ్విప్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ ఆధ్వర్యంలో హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియం గ్రౌండ్లో బుధవారం రాత్రి నిర్వహించిన ‘కార్మిక యుద్ధభేరి’ సభకు మంత్రి హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేదలు, కార్మికులకే ఎక్కువ ప్రయోజనం కలుగుతున్నదని చెప్పారు. కార్మికుల పిల్లలకు నాణ్యమైన చదువు చెప్పించేందుకు సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 1001 గురుకులాలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. దాస్యం వినయ్భాస్కర్కు ప్రత్యేక గుర్తింపు ఉన్నదని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా వరంగల్ పశ్చిమ సెగ్మెంట్లో కార్మిక సంక్షేమ మాసోత్సవాలను నిర్వహించడం గొప్ప విషయమని అభినందించారు.
– వరంగల్, మే 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్, మే 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హనుమకొండ చౌరస్తా : పేదలు, కార్మికుల కోసం ఆలోచించేది సీఎం కేసీఆర్ ఒక్కరేనని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. గత ప్రభుత్వాలు చిరుద్యోగులు, పేదలను నిర్లక్ష్యం చేస్తే సీఎం కేసీఆర్ ‘సఫాయన్నకు సలాం’ అన్న నినాదంతో చిరుద్యోగులకు అండగా నిలిచారని చెప్పారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ ఆధ్వర్యంలో హనుమకొండలోని ఆర్ట్ కాలేజీ ఆడిటోరియం గ్రౌండ్లో బుధవారం రాత్రి నిర్వహించిన ‘కార్మిక యుద్ధభేరి’ సభలో మంత్రి హరీశ్ ప్రసంగిస్తూ హోంగార్డులు, ఆశ వర్కర్లు, అంగన్వాడీలు, సఫాయి కార్మికులు ఇలా ప్రతి చిరుద్యోగి వేతనాన్ని సీఎం కేసీఆర్ పెంచారని చెప్పారు. కార్మిక సంక్షేమంలో తెలంగాణ ఆదర్శంగా ఉన్నదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటోలకు లైఫ్ ట్యాక్స్ తొలగించిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేదలకు, కార్మికులకు ఎక్కువగా ప్రయోజనం కలుగుతున్నదని చెప్పారు.
కార్మికుల పిల్లలకు నాణ్యమైన చదువు చెప్పించేందుకు సీఎం కేసీఆర్ తెలంగాణలో 1001 గురుకులాలను ఏర్పాటు చేశారని, వీటిలో పేదల పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య అందుతున్నదని వివరించారు. కార్మికుల పిల్లలు డాక్టర్లు, లాయర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అయ్యేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు కోసం కాశీబుగ్గకు చెందిన ఆటో డ్రైవర్ రాజమౌళి ఆత్మహత్య చేసుకున్నాడని, అతడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందని, రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిందిని చెప్పారు. రాజమౌళి త్యాగం వెలకట్టలేనిదని గుర్తుచేసుకున్నారు. కార్మికుల పిల్లల బాధ్యత తమ ప్రభుత్వానిదేనని, రెసిడెన్షియల్ స్కూళ్లలో వారికి చదువుకునే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. కార్మికులు ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలని, చెడు అలవాట్లను మానేయాలని, మంచి అలవాట్లతో మంచి జీవితం గడపాలని సూచించారు.
కార్మికులు గుర్తు చేసుకునేలా కార్యక్రమాలను నిర్వహించడంలో దాస్యం వినయ్భాస్కర్కు ప్రత్యేక గుర్తింపు ఉందని మంత్రి హరీశ్రావు ప్రశంసించారు. వరంగల్ పశ్చిమ సెగ్మెంట్లో కార్మిక సంక్షేమ మాసోత్సవం పేరిట నెల రోజులు కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. దాస్యం వినయ్భాస్కర్ కార్మికుల పెన్నిధి, ఆత్మబంధువు అని కొనియాడారు భవన నిర్మాణ కార్మికుల రిజిస్ర్టేషన్లలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అగ్రస్థానంలో ఉన్నదని చెప్పారు. ఇక్కడ 20 వేల మంది రిజిస్ర్టేషన్లు పూర్తయ్యాయన్నారు. సిద్దిపేటలో 10వేలు మాత్రమే అయ్యాయని చెప్పారు. హమాలీ, ఆటో కార్మికులు, అడ్డా కూలీలు ఇలా అందరి ఇండ్లకు స్వయంగా వెళ్లే వినయ్భాస్కర్ వారి ఆత్మబంధువుగా మారారని అభివర్ణించారు. కార్మికుల సంక్షేమం కోసం వినయ్భాస్కర్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి గౌరవం, కార్మికులకు ఆత్మస్థయిర్యం తెచ్చారని చెప్పారు. ఇక్కడ ఉన్నట్లుగానే సిద్దిపేటలో ఆటో డ్రైవర్ల సొసైటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తన ఇంటిని కుదువ పెట్టి వచ్చిన రూ.50 లక్షలను సొసైటీ మూలధనం వాటాగా ఇచ్చానని మంత్రి హరీశ్ తెలిపారు. ఈ వాటా ధనం ఇప్పుడు కోటి రూపాయలకు చేరిందని, డెయిలీ ఫైనాన్స్తో ఇబ్బంది పడే వారికి ఇది బాగా ఉపయోగడుతున్నదని చెప్పారు. కార్మికుల సంక్షేమం కోసం వినయ్భాస్కర్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను సిద్దిపేటలో కాపీ కొట్టేందుకు ప్రయత్నించామని చెప్పారు.
కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రం : చీఫ్ విప్ దాస్యం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని, కార్మిక, కర్షక, రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వానికి ఇక కాలం చెల్లిందని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. యుద్ధభేరి సభలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, ఎల్ఐసీని అమ్ముకోజూస్తుంటే సీఎం కేసీఆర్ అడ్డుకట్ట వేస్తున్నారని చెప్పారు. పేదలు ప్రయాణించే ఆర్టీసీని సీఎం కేసీఆర్ ఆర్థికంగా ఆదుకుంటుంటే, బీజేపీ సర్కారు మాత్రం పేదలు ప్రయాణించే రైళ్లను కూడా అమ్ముకుంటోందన్నారు. సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని, వారి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ తర్వాత పెద్దనగరమైన వరంగల్లో 3వేల మందికి రూ.3.80 కోట్లతో స్ట్రీట్ వెండింగ్ జోన్లు ఏర్పాటు చేశామన్నారు. ఇతర రాష్ర్టాల కార్మికులను కరోనా సమయంలో సీఎం కేసీఆర్ వారి స్వస్థలాలకు పంపేందుకు ప్రత్యేకంగా రైళ్లు, మౌలిక సదుపాయాలు కల్పించి ఆదుకున్నారని, తెలంగాణకు ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ నుంచి వచ్చిన కార్మికులు సీఎం కేసీఆర్ను ఆశీర్వదిస్తున్నారని గుర్తుచేశారు. అంబేద్కర్ ఆలోచనలతో సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని, కార్మికుల పిల్లలకు వసతులతోకూడిన మంచి విద్యను అందించేందుకే రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేశారని, కార్మికుల పిల్లలు వాటిలో చదువుతూ ఐఐటీ, నిట్లో సీట్లు సాధించి ఇంజినీర్లు, డాక్టర్లు అవుతున్నారని చెప్పారు. ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా కార్మికుల కోసం ఏటా మే మాసమంతా కార్మిక మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కార్మికుల పిల్లలకు సన్మానం
ఉన్నత విద్యనభ్యసిస్తున్న, ఉద్యోగాలు పొందిన పలువురు కార్మికుల పిల్లలను మంత్రి హరీశ్రావు, చీఫ్విప్ దాస్యం శాలువాలతో సత్కరించి మెమోంటో అందజేశారు. అనంతరం భవన, ఇతర నిర్మాణ కార్మిక-సంక్షేమ బోర్డు తరఫున కార్మికుల ఆడపిల్లలకు మ్యారేజ్ గిఫ్ట్, ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు.
ఆకట్టుకున్న ‘కార్మిక యుద్ధభేరి’ లోగో ఆవిష్కరణ
సభలో కార్మిక యుద్ధభేరి లోగో ఆవిష్కరణ అందరినీ ఆకట్టుకుంది. సభా వేదిక వెనకాల భారీ క్రేన్ సాయంతో ఆకాశంలో అద్భుతంగా మెరుపులతో, పటాకల మోత నడుమ కార్మిక యుద్ధభేరిలోగోను ఆవిష్కరించారు. పుల్లా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే అరూరి రమేశ్, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, ఎల్లావుల లలితాయాదవ్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కల్పలత సూపర్బజార్ చైర్మన్ జనార్దన్, టీజీవో కోఆర్డినేటర్ అన్నమనేని జగన్మోహన్రావు, టీఎన్జీవోస్ నేత కోల రాజేష్కుమార్గౌడ్, కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకుడు సిరబోయిన కరుణాకర్, దాస్యం వినయ్భాస్కర్ సతీమణి రేవతి పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.