వర్ధన్నపేట, జనవరి 10: మద్యం షాపుల టెండర్లలో భాగంగా 2019 సంవత్సరంలో 11 నకిలీ చలాన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2017-2021 ఫీరియడ్లో వర్ధన్నపేటకు చెందిన ఓ వైన్స్ షాపు వ్యాపారి రెన్యువల్ ఫీజు చెల్లించకుండా బ్యాంకు క్యాషియర్ సహకారంతో తప్పుడు చలాన్లు చెల్లించాడు. భరత్ అనే వ్యక్తి బ్యాంకు కాషియర్ మూడు సీతారామ్ ఎస్బీఐ క్యాషియర్ సహకారంతో రూ. 1.15 కోట్ల తప్పుడు చలాన్లు బయటపడ్డాయి. దీంతో నిందితుడి నుంచి వడ్డీ, అపరాధ రుసుముతో కలిసి మొత్తంగా రూ. 2.29 కోట్లను ప్రభుత్వం వసూలు చేయడంతోపాటు వ్యాపారి, క్యాషియర్పై కేసు నమోదు చేసి రిమాండ్కు కూడా తరలించారు. 2019 అక్టోబర్లో ప్రభుత్వం మద్యం షాపులకు టెండర్లు పిలిచింది.
దీంతో భరత్ తన అనుచరులైన 11 మందితో తప్పుడు చలాన్లతో వరంగల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో టెండర్లు వేశాడు. అబ్కారీ శాఖ ఇటీవల చేపట్టిన ఆడిటింగ్లో 2019లో వర్ధన్నపేటలో 11 షాపులకు సంబంధించి రూ. 22 లక్షలు జమ కాలేదనే అనుమానంతో స్థానిక సీఐ పవన్కు సమాచారం అందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గతంలో జరిగిన ఘటన ఆధారంగా ఎస్ఐబీ, ట్రెజరీలో తనిఖీ చేశారు. ఇందుకు సం బంధించిన రూ. 22 లక్షలు బ్యాంకు, సబ్ట్రెజరీలో డబ్బులు జమ కాలేదని తేలవడంతో తప్పు డు చలాన్లు ఇచ్చారని నిర్ధారణకు వచ్చారు. భరత్తోపాటు టెండర్లలో పేర్లు ఉన్న మరో పది మందిపై ఎక్సైజ్ సీఐ పవన్ స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 11 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని సీఐ సదన్కుమార్ ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్నారు.
2019లో భరత్ 11 తప్పుడు చలాన్లను వరంగల్ ఎక్సైజ్ కార్యాలయంలో అందజేసినట్లు ప్రాథమికంగా తెలుస్తున్నది. గతంలో నిందితుడి నుంచి రూ. 2.29 కోట్ల వరకు ప్రభుత్వం వసూలు చేసి భరత్, బ్యాంకు క్యాషియర్ సీతారామ్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించాం. మరో 11 చలాన్లు కూడా వెలుగు చూడడంతో విచారణ జరుపుతున్నాం.
– పవన్, ఎక్సైజ్ సీఐ