వరంగల్ చౌరస్తా, జూలై 28:ఎంజీఎం క్యాజువాలిటీ విస్తరణకు నోచుకోనుంది. 30 పడకలతో ఉన్న ఈ అత్యవసర విభాగం ఇరుకుగా మారడం.. కేసుల సంఖ్య పెరుగు తుండడం, ఆపద వేళ దవాఖానకు వచ్చే రోగులు, అంబులెన్స్ వచ్చేం దుకు సరిపడా స్థలం లేకపోవడంతో చికిత్స కోసం వచ్చే వారు ఇబ్బంది పడేవారు. ఇకముందు అలాంటి ఇబ్బందులు పడకుండా ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయాలని అధికారులు భావించారు. ఈ మేరకు కార్యా చరణ రూపొందించారు.
క్యాజువాలిటీ(అత్యవసర విభాగం)ని విస్తరించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. కొన్నేండ్ల క్రితం ఎంజీఎం లో 30 పడకల సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేయగా, ప్రస్తుత అవసరాలకు తగినంత స్థలం లేక ఇరుకుగా మారింది. ఉమ్మడి జిల్లాలో భారీ ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు వైద్య సేవలు అం దించడంతో పాటు వారిని పరామర్శించేందుకు వచ్చే బంధుమిత్రులు, నాయకులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ మేరకు విస్తరణ కోసం అంచనాలు రూపొందిస్తున్నారు. ఇందుకోసం ప్రస్తు తం ఉన్న పోలీస్ ఔట్పోస్టును తరలించి, ఆ స్థానంలో ఓ.పీ నమోదు చేపట్టడం, క్యాజువాలిటీ ల్యాబ్ను ప్రధాన ల్యాబ్కు అనుసంధానం చేయాలని భావిస్తున్నా రు. తద్వారా ప్రస్తుతం వైద్యసేవలు అందిస్తున్న విస్తీర్ణాన్ని సుమారు రెండింతలకు పైగా పెంచుకోవచ్చనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా మార్పులు చేయడం వల్ల క్యాజువాలిటీ నుంచి నేరు గా ల్యాబ్కు దారి ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. బాధితులకు వైద్యసేవ ల కోసం వచ్చే వారు వార్డు నుంచి బయటకు రాకుండానే నేరుగా ల్యాబ్లోకి చేరుకునే వీలుంటుంది.
అంబులెన్స్లకు సులువైన దారి
ప్రమాదాల్లో గాయపడిన వ్యక్తిని బతికించేందుకు ప్రతిక్షణం విలువైనదే. అందుకే అంబులెన్స్ల దారి విషయంలో అధికారులు శ్రద్ధ చూపితే బాధితులకు తక్కువ వ్యవధిలో వైద్యం అందించే వీలుంటుంది. ముఖ్యంగా ఇక్కడికి 108 వాహనాల్లో తీసుకొచ్చే ఎమర్జెన్సీ పేషెంట్ల ను అంబులెన్స్ నుంచి దింపేందుకు సరిపడా స్థలం లేకపోవడం వల్ల ముందుగా వాహనాన్ని మళ్లించాల్సి(రివర్స్) వస్తున్న ది. అదే సమయంలో అక్కడ మరో వాహనం ఉంటే మరింత ఇబ్బంది పడా ల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు మొదటి గేట్ నుంచి లోపలికి వచ్చిన వాహనం నేరుగా క్యాజువాలిటీ విభాగం ముందు నిలిపి బాధితుడిని దింపిన తర్వాత అలాగే ముందుకు వెళ్లి మహాత్మాగాంధీ విగ్రహం ముందు నుంచి గేట్-2 ద్వారా బయటికి వెళ్లేలా అధికారులు చర్యలు చేపట్టారు.
మెరుగైన సేవల కోసమే విస్తరణ
గతంతో పోల్చితే క్యాజువాలిటీకి కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతం 30 పడకలున్నాయి. స్థలాభావం వల్ల పరిసరాలు ఇరుకుగా మారాయి. భారీ ప్రమాదాలు జరిగినప్పు డు వైద్యులు, బాధితులకు ఇబ్బందులు తప్పడం లేదు. మున్ముందు అలాంటి సమస్యలు తలెత్తకుండా సత్వరం మెరుగైన సేవలందించేందుకు ఆ ప్రాంతాన్ని విస్తరించాలనుకుంటున్నాం. దీని వల్ల తక్కువ సమయంలో ఎక్కువ మందికి వైద్యం అందించే వీలుంటుంది. అలాగే క్యాజువాలిటీ ఫార్మసీ కూడా లోపలే ఉండేలా ప్రయత్నిస్తున్నాం.