హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 27 : బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో మహిళల బ్యాగుల్లోని బంగారు ఆభరణాలు, డబ్బు చోరీ చేస్తున్న ముగ్గురు మహిళలను సీసీఎస్, ఇంతెజార్గంజ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.5.50 లక్షల విలువైన 110 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అకల్చెడ గ్రామానికి ఆకుల రజిత అలియాస్ బుజ్జి(40), చింతల లక్ష్మి (65), కరీంనగర్ జిల్లా తీగలగుంటపల్లి గ్రామానికి చెందిన మంగతార(38) ఉన్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వివరాలను ఆదివారం వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి వెల్లడించారు. నిందితురాలు రజిత అలియాస్ బుజ్జి రోజువారీగా కూలిపనులు చేస్తుండేది. కూలి ద్వారా వచ్చే డబ్బులు తన విలాసవంతమైన జీవితానికి సరిపోకపోవడంతో రద్దీ ప్రదేశాల్లో 2002 సంవత్సరం నుంచి చోరీ చోరీలను ప్రారంభించింది.
ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో చోరీలకు పాల్పడడంతో పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారు. రజిత గత సంవత్సరం మార్చి నెల కొమురవెల్లి జాతరలో సెల్ఫోన్ చోరీ చేయడంతో పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అనంతరం బెయిల్పై విడుదలైన రజిత తన దగ్గరి బంధువులు చింతల లక్ష్మి, మంగతారకు డబ్బు ఆశ చూపి రద్దీ ప్రదేశాల్లో చోరీలు చేయాలని చెప్పింది. ఈ ముగ్గురు మహిళా దొంగలు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత సంవత్సరం జూలై నుంచి ఇప్పటి వరకు ఐదు చోరీలకు పాల్పడ్డారు. ఇందులో జనగామ బస్టాండ్లో 48 గ్రాముల బంగారు ఆభరణాలు, ఇంతెజార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బట్టల షాపులో 17.5 గ్రాములు, వరంగల్ ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో పుస్తెలతాడు, వరంగల్ బస్టాండ్లో 15 గ్రాముల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. క్రైం, ఆపరేషన్ అదనపు డీసీపీ, క్రైం ఏసీపీ పర్యవేక్షణలో సీసీఎస్, ఇంతెజార్గంజ్ పోలీస్ బృందాలు ప్రత్యేక దర్యాప్తు చేపట్టాయి.
చోరీలు జరిగిన సంఘటన స్థలాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుని నిందితులను గుర్తించి నిఘా ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం చోరీ సొత్తును వరంగల్ బులియన్ మారెట్లో అమ్మేందుకు వచ్చారని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో సీసీఎస్, ఇంతెజార్గంజ్ పోలీసులు వెళ్లి ముగ్గురు మహిళా దొంగలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలను అంగీకరించారు. పోలీసులు వీరి వద్ద ఉన్న చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన క్రైమ్స్, ఆపరేషన్ అదనపు డీసీపీ పుష్పారెడ్డి, క్రైం ఏసీపీ బాబురావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రమేశ్ కుమార్, ఇంతెజార్గంజ్ ఇన్స్పెక్టర్లు మల్లేశ్, సీసీఎస్, ఇంతెజార్గంజ్ ఎస్సైలు సంపత్కుమార్, నాగరాజు, సీసీఎస్ సిబ్బంది ఏఎస్సైలు శివకుమార్, వీరస్వామి, ఫర్వీన్, పద్మ, హెడ్ కానిస్టేబుల్ జంపయ్య, కానిస్టేబుళ్లు వేణుగోపాల్, చంద్రశేఖర్, నజీరుద్దీన్, మహిళా కానిస్టేబుళ్లు మంజుల, స్రవంతి, శ్రీలత, శైలజ, సుకన్య, చైతన్య, నవ్యను పోలీస్ కమిషనర్ అభినందించారు.