సుబేదారి, జూలై 31 : యువత మత్తుపదార్థాలకు బానిస కాకుండా చూసుకోవాల్సిన బాధ్యతపై అందరిపై ఉందని పోలీసు కమిషనర్ తరుణ్జోషి అన్నారు. శనివారం హన్మకొండలోని పోలీస్ కమిషనరేట్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణపై కమిషనరేట్ పరిధి ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లతో సీపీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్ యువతపైనే ఆధారపడి ఉందన్నారు. మత్తుపదార్థాలను సేవించడానికి డబ్బు కోసం చాలా మంది విద్యార్థులు చెడు మార్గాలను ఎంచుకుని, జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. విద్యార్థుల అలవాట్లు, కదలికలపై విద్యాసంస్థల యాజమాన్యాలు, తల్లిదండ్రులు దృష్టిపెట్టాలని సూచించారు. ముఖ్యంగా పిల్లల్లో వస్తున్న మానసిక, శారీరక మార్పులను గమనించాలన్నారు. విద్యార్థులు కళాశాలలో ప్రవర్తించే తీరు, పరిసర ప్రాంతాల్లోని వ్యాపార కార్యకలాపాలపై నిఘాపెట్టాలని సూచించారు. గంజాయి అమ్మ కం, వాడకం నిషేధమన్నారు. ఇందులో ఎవరినీ ఉపేక్షించేది లేదని సీపీ హెచ్చరించారు. ఈ విషయంపై విద్యార్థులకు అవగహన సదస్సులు ఏర్పాటు చేయాలని ప్రిన్సిపాళ్లకు సూచించారు. సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ పుష్ప, షీ టీం ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రావు పాల్గొన్నారు.
రేపటి పోలీసు గ్రీవెన్స్ రద్దు
వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డేను ప్రభుత్వ సెలవు దినం కారణంగా రద్దు చేసినట్లు సీపీ తరుణ్జోషి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదులను గురువారం గ్రీవెన్స్ డేలో స్వీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.