కాలం వెళ్లదీస్తున్న కేంద్ర ప్రభుత్వం
పంజాబ్ తరహాలో తెలంగాణ ధాన్యాన్ని కొనాలి
రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి
వర్ధన్నపేట, నవంబర్ 12: రైతులు, ప్రజలను తప్పుదారి పట్టించేలా తప్పుడు మాటలు చెబుతూ బీజేపీ నాయకులు కాలం వెళ్లదీస్తున్నారని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పిలుపు మేరకు వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ నేతృత్వంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని ఒప్పించలేక రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ ఏడాది రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 1.32 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారన్నారు. కానీ, కేంద్రం కేవలం 60 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసేందుకు అంగీకరించిందన్నారు. పంజాబ్లో సుమారు 2 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న కేంద్రం తెలంగాణపై వివక్షత చూపుతున్నదని ధ్వజమెత్తారు. కేంద్రం దిగొచ్చే దాకా టీఆర్ఎస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగానికి టీఆర్ఎస్ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణలతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలంగాణ రైతాంగాన్ని మరోసారి సంక్షోభంలోకి నెట్టేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎంపీపీలు అన్నమనేని అప్పారావు, మధుమతి, కమల, జడ్పీటీసీలు భిక్షపతి, శ్రీరాములు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షురాలు లలితాయాదవ్, ఆర్బీఎస్ నాలుగు మండలాల అధ్యక్షులు, పీఏసీఎస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.