దుబాయ్, జూలై 9 : ఇరాన్పై అమెరికా గురువారం తెల్లవారుజామున భీకర దాడులతో విరుచుకుపడగా ఇందుకు ప్రతిస్పందనగా ఇరాన్ పశ్చిమాసియాలోని అమెరికా మిత్ర దేశాలపై దాడులు జరిపింది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించేందుకు కుదుర్చుకున్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం మనుగడకు ముప్పు ఏర్పడింది. బుధవారం మొదలైన పరస్పర దాడులు గురువారం తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. పశ్చిమాసియా అంతటా దాడుల హెచ్చరికల సైరన్లతో మార్మోగింది. అమెరికా నౌకాదళానికి చెందిన ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం ఉన్న బహ్రెయిన్లో కనీసం మూడుసార్లు సైరన్లు హోరెత్తాయి. కువైట్, ఖతార్ లక్ష్యంగా క్షిపణి దాడులు జరిగాయి.
అమెరికా బలగాలు, యుద్ధ విమానాలు బసచేసిన జోర్దాన్లో కూడా గురువారం మధ్యాహ్నం సైరన్లు మార్మోగాయి. ఇరాన్లోని ఏకైక అణు విద్యుత్ కేంద్రం చుట్టుపక్కల ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని గురువారం సాయంత్రం అమెరికా వైమానిక దాడి చేసిందని ఇరాన్కు చెందిన ఒక అధికారి ఆరోపించారు. అలాగే మధ్యాహ్నం దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వచ్చాయి. భారత్ సహకారంతో నిర్మిస్తున్న చాబహార్ పోర్టుపైనా అమెరికా దాడులు చేసింది. మొత్తంగా గత రెండు రోజుల్లో 170 లక్ష్యాలపై దాడులు చేసింది. హొర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ ఇటీవల జరిపిన దాడులు కాల్పుల విరమణ ఒప్పందానికి ముగింపు పలికాయని, ఒకవేళ ఇరాన్ దాడులు ఆపకపోతే ఘర్షణ తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఈ దాడులు జరిగాయి.
ఇరాన్ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ మృతదేహాన్ని ఇరాక్ నుంచి ఫైటర్ జెట్ ఎస్కార్తో ఇరాన్కు తరలించారు.మషాద్లో గురువారం సాయంత్రం ఖమేనీని ఖననం చేశారు. మషాద్లో లక్షలాది మంది ఇరాన్ ప్రజలు ఆ దేశ జెండాలు పట్టుకుని అంతిమ వీడ్కోలు పలికారు. ఖమేనీతో పాటు అతని మనవరాలు, కూతురు, అల్లుడు, మొజ్తబా ఖమేనీ భార్యను కూడా ఖననం చేసినట్టు ఇరాన్ అధికారులు వెల్లడించారు.