గోవిందరావుపేట, సెప్టెంబర్ 26 : దట్టమైన అడవుల్లో ములుగు జిల్లా పర్యాటకపరంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అందుకే రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా వివిధ ప్రాంతాలతో పాటు విదేశీ పర్యాటకుల సందడి పెరుగుతోంది. ఇందుకోసం పర్యాటక శాఖ అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. టూరిస్టులను ఆకట్టుకునేందుకు రూ.88కోట్ల వ్యయంతో ములుగు గట్టమ్మ, రామప్ప, లక్నవరం, సమ్మక్క-సారలమ్మ తాడ్వాయి, మేడారం, బొగత, మల్లూరు ప్రాంతాల్లో పర్యాటకులను ఆకట్టుకునేలా కాటేజీలు, రెస్టారెంట్లు అందుబాటులోకి తీసుకొచ్చి పర్యాటకుల మనస్సు దోచేలా తీర్చిదిద్దింది. అలాగే టూరిజం శాఖ మేనేజింగ్ డైరెక్టర్ బోయినపల్లి మనోహర్ ప్రత్యేక కృషితో లక్నవరంలో బోటింగ్, వేలాడే వంతెనలు, జిప్ సైక్లింగ్, కయాకింగ్ ఏర్పాటుచేయగా పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంతో కేంద్ర పర్యాటక శాఖ మరిన్ని నిధులు కేటాయించడంతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే రాష్ట్ర టూరిజం శాఖ అధికారులు రామప్పలో చేపట్టిన అభివృద్ధి పనులపై సర్వే చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలోనే ములుగు జిల్లా పర్యాటకరంగ అభివృద్ధిలో దూసుకువెళ్తోంది.