వరంగల్, నవంబర్ 25(నమస్తేతెలంగాణ): వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి స్థానానికి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ స్థానం నుంచి పోటీకి దిగిన అభ్యర్థుల్లో ముగ్గురు గురువారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో బరిలో టీఆర్ఎస్ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి మాత్రమే ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి పోచంపల్లి సహా పద్నాలుగు మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. బుధవారం జరిగిన నామినేషన్ల పరిశీలనలో తొమ్మిది మంది స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులు మంత్రి శ్రీశైలం, పోతురాజు రాజు, బానోత్ రూప్సింగ్ల నామినేషన్ పత్రాలు సక్రమంగా ఉన్నట్లు వరంగల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ బీ గోపి ప్రకటించారు. పరిశీలనలో ఉన్న మరో స్వతంత్ర అభ్యర్థి బీరం దేవేందర్రెడ్డి నామినేషన్ను ఎన్నికల నియమావళి ప్రకారం సరిగా లేదని తిరస్కరించినట్లు ఆయన గురువారం వెల్లడించారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు శుక్రవారం వరకు ఉంది. ఈ నేపథ్యంలో గురువారం స్వతంత్ర అభ్యర్థులు మంత్రి శ్రీశైలం, పోతురాజు రాజు, బానోత్ రూప్సింగ్ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈ ముగ్గురు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి బీ గోపి ప్రకటించారు. వీరి ఉపసంహరణతో ఈ స్థానం నుంచి పోటీలో టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి మాత్రమే ఉండడం వల్ల ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత శుక్రవారం పోచంపల్లి ఏకగ్రీవ ఎన్నికపై అధికారిక ప్రకటన వెలువడనుంది. వరంగల్ స్థానిక సంస్థల శాసనమండలి స్థానం నుంచి వరుసగా రెండోసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి ఏకగ్రీవంగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్రెడ్డికి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. పోచంపల్లి ఏకగ్రీవ ఎన్నికపై హర్షం వెలిబుచ్చారు. టీఆర్ఎస్ శ్రేణులు మిఠాయిలు పంచి సంబురాలు జరుపుకున్నారు.
పోచంపల్లికి పలువురి అభినందన..
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో గెలిచిన పోచంపల్లి శ్రీనివాస్రెడ్డికు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి తదితర టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు. శ్రీనివాస్రెడ్డి ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, తదితర ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులకు ఈ సందర్భంగా మంత్రి దయాకర్రావు ధన్యవాదాలు తెలిపారు. మన రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు మరోసారి ప్రజలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అండగా నిలిచారని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన ఉన్నదని, మన రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు.