నర్సంపేట, ఏప్రిల్ 13 : పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు సీఎం కేసీఆర్ చేయూత అందిస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బుధవారం నర్సంపేట నియోజకవర్గానికి చెందిన 221 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రూ.2.21కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల సాధికారత కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్టు తదితర పథకాలను అమలు చేస్తున్నారన్నారు.
కల్యాణలక్ష్మి పథకానికి ప్రేరణ అయిన లూనావత్ కల్పన కూతురు చంద్రకళ వివాహం తన చేతుల మీదుగా జరిపించడం సంతోషంగా ఉందన్నారు. ఈ బృహత్తర పథకం ఇప్పటికే ఎంతో మంది నిరుపేదలకు ఆర్థిక వెసులుబాటును కల్పించిందని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్ధిదారులకు సహకరించి వారు పథకం కోసం దరఖాస్తు చేసుకునే విధంగా సలహాలు ఇవ్వాలని కోరారు. అలాగే, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రైవేట్ దవాఖానల్లో వైద్యం చేయించుకోవడానికి ఎల్వోసీలు అందిస్తున్నట్లు తెలిపారు. దుగ్గొండి మండలం నారాయణ తండా గ్రామానికి చెందిన మాలోత్ వరుణ్కుమార్కు రూ.2లక్షల విలువ చేసే లెటర్ ఆఫ్ క్రెడిట్ అందించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న తదితరులు పాల్గొన్నారు.