సంగెం, మే 4 : పల్లెప్రగతితో మారుమూల గ్రామాలు సైతం అభివృద్ధి బాట పట్టాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని నల్లబెల్లి గ్రామంలో గురువారం రూ.కోటీ 24లక్షల81వేలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.12లక్షలతో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం, రూ.12.60లక్షలతో చేపట్టిన శ్మశానవాటిక, రూ.36.21లక్షలతో చేపట్టిన 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదామును ప్రారంభించారు. రూ.9 లక్షలతో ఈద్గా, ఖబరస్తాన్ ప్రహరీ, రూ.15లక్షలతో మహిళా భవనం, రూ.40లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు సబ్సిడీ ట్రాక్టర్ను అందజేశారు. వరి, మక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, గోదామును డీసీసీబి చైర్మన్ మార్నేని రవీందర్రావుతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు కేసీఆర్ సీఎం కావడం అందరి అదృష్టమన్నారు. రైతును రాజు చేయడమే సీఎం సంకల్పమని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని, కేంద్రం సహకరించకపోయినా ఇక్కడ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆగలేదని పేర్కొన్నారు. జనరంజక పాలన చేస్తున్న కేసీఆర్కు ప్రజలంతా అండగా నిలువాలన్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.10వేల చొప్పున ఇస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గుణపాఠం చెప్పాలన్నారు. వారు పాలించే రాష్ర్టాల్లో తెలంగాణ తరహా సంక్షేమ పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించాలన్నారు.
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్.. :డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు
సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు అన్నారు. బ్యాంకు రుణాలు తీసుకున్న రైతులు డబ్బులు కట్టకపోతే గత ప్రభుత్వాలు ఇబ్బందులు పెట్టి, ఇంటి తలుపులు తీసుకుపోయేవన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో సహకార సంఘాలకు సీఎం కేసీఆర్ ఎంతగానో ప్రాముఖ్యతనిచ్చారన్నారు. జిల్లాలో 70 సంఘాలు డీసీసీబీ పరిధిలో ఉన్నాయని తెలిపారు. అందులో 54 సంఘాలకు గోదాములను మంజూరు చేశామన్నారు. సంగెంతో పాటు నల్లబెల్లిలో గోదాములు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పంట రుణాలతో పాటు విదేశీ విద్య, ఇండ్ల నిర్మాణానికి, మహిళా సంఘాలకు రుణాలు ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం బ్యాంకు టర్నోవర్ రూ.1700 కోట్లు అని, ఇది కేసీఆర్ సహకారం వల్లే సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వేల్పుల కుమారస్వామి, వైస్ చైర్మన్ కొట్టం రాజు, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సారంగపాణి, సర్పంచ్ మామిడాల సుదర్శన్, ఎంపీటీసీ కట్ల సుమలత, మండల కోఆప్షన్ సభ్యుడు మన్సూర్అలీ, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కందకట్ల నరహరి, పీఆర్ డీఈ జ్ఞానేశ్వర్, ఏఈ రమేశ్, ఏవో సీహెచ్ యాక య్య, నాయకులు ఉండీల రాజు, మేరుగు వీరేశం, కడ్దూరి వీరభద్రయ్య, జన్నయ్య, పంచాయతీ కార్యదర్శి సునీత పాల్గొన్నారు.
రైతులకు అండగా నిలుస్తాం..
పరకాల : బీఆర్ఎస్ రైతు సంక్షేమ ప్రభుత్వమని, అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతుకు అండగా నిలుస్తామని ఎమ్మెల్యే చల్లా అన్నారు. పంట నష్టంపై హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో నియోజకవర్గంలోని వ్యవసాయాధికారులతో సమీక్ష నిర్వహించారు. పంట నష్టం జరిగిన రైతుల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పంట నష్టం వివరాలను నమోదు చేయాలని సూచించారు. రైతులకు అన్ని న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో పంట నష్టం నమోదుకు వచ్చే అధికారులకు రైతులు సహకరించాలని కోరారు. గత సంవత్సరం వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించిందని, అదే తరహాలో ప్రస్తుతం కూడా అండగా నిలుస్తుందన్నారు.