వరంగల్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దళిత బంధు పథకం అమలు కోసం హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ మండలం హుజూరాబాద్ నియోజకవర్గంలోనే ఉంది. ఈ మండలంలో దళిత బంధు పథకాన్ని పక్కాగా అమలు చేసేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి దళిత కుటుంబానికి ప్రభుత్వ పథకం అందేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం, శనివారం ప్రతి గ్రామంలో సర్వే చేయనున్నారు. ఇంటింటికీ సర్వేను సమర్థవంతంగా నిర్వహించేందుకు అనుగుణంగా కమలాపూర్ మండలంలోని గ్రామాలను 11 క్లస్టర్లుగా విభజించారు. ప్రతి క్లస్టర్కు ఒక జిల్లా స్థాయి అధికారిని నియమించారు. వీరి పర్యవేక్షణలో మండల వ్యాప్తంగా 32 సర్వే బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బృందానికి ప్రత్యేక అధికారి నేతృత్వం వహిస్తారు. ఒక్కో బృందంలో ఆరుగురు చొప్పున సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు. రెండు రోజులపాటు ఈ బృందాలు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తాయి. పొద్దున 8 గంటలకు సర్వే మొదలవుతుంది. దళితవాడలోని ప్రతి ఇంటింటికీ క్లస్టర్ ఆఫీసర్, స్పెషల్ ఆఫీసర్, సహాయ సిబ్బంది వెళ్లి ఆన్లైన్, ఆఫ్లైన్ డాటాను సేకరిస్తారు. సేకరించిన వివరాలను దళిత బంధు యాప్లో నమోదు చేస్తారు. బ్యాంకు అధికారులు ఈ సర్వే బృందాల వెంట ఉంటారు. లబ్ధిదారులకు కొత్తగా తెలంగాణ దళిత బంధు బ్యాంకు ఖాతాలను ప్రారంభిస్తారు. కమలాపూర్ మండలంలో దళిత బంధు ఖాతాల నిర్వహణను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పగించారు.
సర్వే ఏర్పాట్లపై సమీక్ష…
దళిత బంధు ఇంటింటి సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. దళిత బంధు ఇంటింటా సర్వే ఏర్పాట్లపై క్లస్టర్ ఆఫీసర్లు, స్పెషల్ ఆఫీసర్లు, బ్యాంకు అధికారులు, సపోర్టింగ్ స్టాఫ్, పంచాయతీ కార్యదర్శులతో రాజీవ్గాంధీ హన్మంతు గురువారం కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. దళిత కుటుంబాలు ఇండ్లలో ఉండే సమయంలోనే బృందాలు అక్కడికి వెళ్లాలని సూచించారు. సర్వే నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన 32 బృందాలు పకడ్బందీగా పనిచేయాలని ఆదేశించారు. ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు బ్యాంకు ఖాతా ఉండేలా బ్యాంకు అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. కమలాపూర్ మండలంలో దళిత బంధు ఖాతాల నిర్వహణ బాధ్యతను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పగించినట్లు కలెక్టర్ తెలిపారు. ఇంటింటి సర్వేపై గురువారం సాయంత్రమే అన్ని దళితవాడల్లో చాటింపు చేయించాలని గ్రామ కార్యదర్శులను ఆదేశించారు. నిరుపేద దళితుల కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు.
అధికారులు, సిబ్బంది అంకిత భావంతో పారదర్శకంగా ఓపికగా, సేవాభావంతో పని చేయాలని… ప్రతి దళిత కుటుంబం వివరాలను సేకరించి, పథకాన్ని విజయవంతంగా అమ లు చేయాలని చెప్పారు. సర్వేపై ప్రతి మండలానికి రాష్ట్ర స్థాయి అధికారి ఒకరిని పర్యవేక్షకులుగా ప్రభు త్వం నియమించిందని కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, లీడ్ బ్యాంకు మేనేజర్ మురళీమోహన్రావు, దళిత బంధు స్టేట్ కమిటీ మెంబర్ కృష్ణవేణి, యూనియన్ బ్యాంకు డీజీఎం శంకర్లాల్, క్లస్టర్ అధికారులు డీఆర్డీవో ఏ శ్రీనివాస్కుమార్, డీపీవో జగదీశ్వర్, పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస్, డీఎండబ్ల్యూవో శ్రీను, ఇండస్ట్రీస్ జీఎం హరిప్రసాద్, డీబీసీడబ్ల్యూవో రాంరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీలత, అగ్రికల్చర్ ఏడీ దామోదర్, గ్రౌండ్ వాటర్ డీడీ శ్రీనివాస్రావు, డీసీవో నాగేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ ఏడీ పరకాల రవికుమార్, స్పెషల్ ఆఫీసర్లు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.