భీమదేవరపల్లి, జూలై 5 : దానయ్యగుట్టపై ఓ అద్భుతం దర్శనమిస్తోంది. గుట్టపై మాఫిక్ మైక్రో గ్రాన్యులర్ ఎన్క్లేవ్స్లు ఉన్నాయని పురావస్తు పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి తెలిపారు. భీమదేవరపల్లి మండలం గొల్లపల్లి గ్రామ సమీపంలో దానయ్య గుట్ట ఉంది. మనిషి గుండెకు రంధ్రం పడినట్లుగానే గుట్ట ఉపరితలంపై రంధ్రాలు ఉన్నాయని.. భూగర్భ శాస్త్రవేత్తలతో పాటు సామాన్యులను సైతం ఇవి ఆకర్షిస్తున్నాయని వెల్లడించారు.
దానయ్యగుట్టపై ఏటవాలులో రెండు దిగుళ్ల మధ్య ఏర్పడిన ఒక రంధ్రాన్ని గుర్తించారు. భూగర్భ శాస్త్రం ప్రకారం వీటిని మాఫిక్ మైక్రో గ్రాన్యులర్ ఎన్క్లేవ్స్ అంటారు. భూమి లోపల కొన్ని కిలోమీటర్ల లోతులో రెండు రకాల శిలాద్రవాల మధ్య పరస్పరం రసాయన, యాంత్రిక, ఉష్ణ మార్పులు జరగడం వల్ల ఈ ‘మాఫిక్ మైక్రో గ్రామన్యులర్ ఎన్క్లేవ్స్’ ఏర్పడుతాయి. వీటిని సంక్షిప్తంగా ‘ఎంఎంఈ’గా పిలుస్తారు. పక్కపక్కనే ఏర్పడిన ఈ ఎన్క్లేవ్స్ చూడడానికి పెద్ద పెద్ద దిగుళ్ల వలే కనిపిస్తాయి. వీటి మధ్య ఏర్పడిన ఖాళీ ప్రాంతం గాలి తాకిడికి, నీటి ప్రవాహాల కోతకు గట్టిపడిన అతిథియ శిలాద్రవం ఓడిపోయి క్రమంగా రంధ్రం ఏర్పడింది.
దానయ్య గుట్ట ఉపరితలంపై ఏర్పడిన రంధ్రం చూడడం గొప్ప అనుభూతినిస్తుందని రెడ్డి రత్నాకర్రెడ్డి పేర్కొన్నారు. గతంలోనూ చిల్పూర్ మండలంలోని లింగంపల్లి గుట్టకు రంధ్రాన్ని గుర్తించినట్లు తెలిపారు. వీటితోపాటు దానయ్యగుట్టపై గంటు చిత్రం(పెత్రోగ్లిప్)గా కాయోత్సర్గ భంగిమలో గీసిన జైన తీర్థాంకరుని చిత్రం, రాతిపలకలతో నిర్మించిన జైన బసది, అందమైన కోనేరు చూడవచ్చని తెలిపారు.