భూపాలపల్లి రూరల్, మే 19 : దళితబంధు యూనిట్ల గ్రౌడింగ్ ప్రక్రియ వారం రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితబంధు పథకంలో జిల్లాకు 151 యూనిట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇందులో మంథని నియోజకవర్గ పరిధిలో 60 యూనిట్లకు 31 యూనిట్లు రవాణా, 29 రవాణాయేతర యూనిట్లు, భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో 90 యూనిట్లకు 56 యూనిట్లు రవాణా, 29 రవాణాయేతర యూనిట్లు, ములుగు నియోజక వర్గ పరిధిలో ఒక రవాణా యూనిట్ ఉన్నాయన్నారు. వీటికి మంజూరు ప్రక్రియ పూర్తయిం దని, రవాణాయేతర యూనిట్ల సంబంధించి ఆయా యూనిట్ల సేకరణకు వరంగల్, హైదరాబాద్ మార్కెట్ నుంచి కొటేషన్లు, సంప్రదింపులు జరిపి, వారం రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
యూనిట్ల ధర, నాణ్యత విషయంలో నిబంధనలు పాటించాలని, ప్రత్యేక అధికారులు, నోడల్ అధికారులు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మంజూరుకు సంయుక్తంగా ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ఏ దశలోనూ నిర్లక్ష్యం వహించొద్దని, వంద శాతం లక్ష్యం పూర్తి చేసి పథకాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వర్లు, డీఆర్డీవో పురుషోత్తం, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి సదానందం, జిల్లా వ్యవసాయ అధికారి విజయభాస్కర్, పరిశ్రమల శాఖ జీఎం శ్రీనివాస్, జిల్లా ఉద్యానవన అధికారి అక్బర్, ఎల్డీఎం శ్రీనివాసరావు, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ రాఘవేందర్, ఎంవీఐ సంధాని మహ్మద్, ఐటీడీఏ డీఈ సంపత్కుమార్, జడ్పీ డిప్యూటీ సీఈవో రఘువరన్ పాల్గొన్నారు.