బయ్యారం, ఆగస్టు 10: అతడో నిరుపేద విద్యార్థి.. చెస్లో రాణించాలనే పట్టుదల.. రాణిస్తాననే విశ్వాసం .. తల్లి తపన .. కోచ్ల కృషి .. అతడిని అంతర్జాతీయ క్రీడాకారుడిగా తీర్చిదిద్దింది. పదేళ్ల ప్రాయంలోనే మైండ్ గేమ్ చెస్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించి ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అని నిరూపించుకున్నాడు బయ్యారం మండలం గౌరారానికి చెందిన వంశీ. ఆగస్టు 1నుంచి 5వరకు రష్యా వేదికగా సాంకేతిక పరిజ్ఞానంతో జరిగిన అంతర్జాతీయ చెస్ (అండర్ -10 ) పోటీల్లో తెలంగాణ నుంచి ఒక్కడే పాల్గొని అద్భుత ప్రతిభ చూపాడు.
మహబూబాబాద్ జిల్లా గౌరారానికి చెందిన వీసాల రమేశ్, సుమలత దంపతుల కొడుకు వంశీ. ఐదో తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. ఆరో తరగతి నుంచి కొత్తగూడ మోడల్ స్కూల్లో విద్యనభ్యసిస్తున్నాడు. విద్యార్థుల మేధస్సును పెంపొందించేందుకు దోహదపడే చెస్ క్రీడలో పేద విద్యార్థులు సైతం రాణించాలనే లక్ష్యంతో గత కలెక్టర్ వీపీ గౌతమ్ ‘మహబూబాబాద్ చెస్ అకాడమీ’ని ఏర్పాటు చేసి ఇద్దరు కోచ్లను నియమిం చారు. అనంతరం ఉమ్మడి జిల్లాలోని గురుకుల, మోడల్ పాఠశాలల్లో చదరంగంపై ఆసక్తి ఉన్న ఇరవై మంది విద్యార్థులను ఎంపిక చేసి ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలోనే చదరంగంపై మక్కువ ఉన్న వంశీ రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాడు. ఇటీవల జరిగిన వరల్డ్ కప్-21 పోటీల్లోనూ ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించి ప్రపంచ గుర్తింపు పొందాడు.
సాధించిన విజయాలు
2021 మార్చిలో సూర్యాపేటలో జరిగిన స్టేట్మీట్లో అండర్ -10 విభాగంలో మొదటి స్థానం
మార్చి 31, ఏప్రిల్ 3న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన తెలంగాణ సీనియర్ రేటింగ్ టోర్నమెంట్లో సీనియర్స్తో తలపడి ఇంటర్నేషనల్ రేటింగ్లో 1241 పాయింట్లు సాధించాడు.
ఏప్రిల్ -21 హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ఆల్ ఇండియా ర్యాపిడ్ రేటింగ్ టోర్నమెంట్లో అంతర్జాతీయ స్థాయి రేటింగ్లో 1200 పాయింట్లు సాధించాడు.
జూన్లో జరిగిన తెలంగాణ స్టేట్ అండర్ -10 సెలక్షన్స్లో నాలుగో స్థానం పొంది జాతీయస్థాయికి ఎంపికయ్యాడు.
జూన్లో జాతీయ స్థాయి అండర్ -10 సెలక్షన్స్ జరగ్గా ప్రపంచకప్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ పోటీల్లో ఇండియా నుంచి 978 మంది పాల్గొనగా, 11 రౌండ్లలో 9 పాయింట్లు సాధించి ఆల్ ఇండియాలో 11వ స్థానం కైవసం చేసుకుని ప్రపంచ కప్ పోటీలకు తెలంగాణ నుంచి ఒక్కడే ఎంపికయ్యాడు.
విశ్వవిజేతగా నిలుపుతాం..
చదరంగంపై ఆసక్తి వల్లనే వంశీ తక్కువ సమయంలో రాణించి అంతర్జాతీయ క్రీడాకారుడిగా ఎదిగాడు. వరల్డ్ కప్-22లో ప్రపంచ చెస్ విజేతగా నిలుపడమే మా ధ్యేయం. 2500 పాయింట్లు సాధించేలా చేసి వంశీని గ్రాండ్ మాస్టర్గా తీర్చి దిద్దుతాం. పేద విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసి వారిని క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు చెస్ అకాడమీ కృషి చేస్తున్నది. వంశీ ప్రపంచ స్థాయిలో రాణించేం దుకు కలెక్టర్ గౌతమ్, టోర్నమెంట్ రీజినల్ కో ఆర్డినేటర్లు రాజ్యలక్ష్మి, అధికారులు ఆంజనే యులు, రమేశ్ కృషి చేశారు.
వరల్డ్ కప్-21 పోటీల్లో 6.5 పాయింట్లు ..
ఈనెల 1నుంచి 5వరకు రష్యా వేదికగా ఆన్లైన్లో ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ చెస్ (అండర్ -10 ) పోటీల్లో వంశీ అద్భుత ప్రతిభ చూపాడు. ఈ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా 227 మంది క్రీడాకారులు పాల్గొనగా మనదేశం నుంచి 15 మంది ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ నుంచి మహబూబాబాద్ జిల్లాకు చెందిన వంశీ ఒక్కడే పాల్గొని సౌతాఫ్రికా, వియత్నాం, అమెరికా, అస్ట్రేలియా, మెక్సికో, స్కాట్లాండ్ వంటి దేశాల క్రీడాకారులతో తలపడి 10 రౌండ్లలో 6.5 పాయింట్లు సాధించి ప్రపంచ విజేతల్లో 44వ
స్థానంలో నిలిచాడు.
సంతోషంగా ఉంది..
మా వంశీ ప్రపంచ స్థాయి చెస్ క్రీడాకారుడిగా పేరు తెచ్చుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. వంశీకి చిన్నప్పటి నుంచే ఆటలంటే ఇష్టం. మాది పేదకుటుంబమైనా ఆటల్లో ప్రోత్సహించాం. కొన్నిచోట్ల పోటీలకు స్వయంగా తీసుకువెళ్లాం. చదరంగంలో వరల్డ్ కప్ విజేతగా వంశీని చూడాలన్నది నా ఆశ.