గర్భిణులు, బాలింతలకు అమ్మఒడి వరంగా మారింది. ప్రతి నెలా దవాఖానకు వెళ్లి పరీక్షలు చేయించుకునేందుకు వారు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం 102 పేరిట ప్రత్యేక వాహనాలను సమకూర్చి నాణ్యమైన సేవలను ఉచితంగా అందజేస్తోంది. జిల్లాలో అమ్మఒడి వాహనాలు ఏడు ఉండగా, వీటి ద్వారా ప్రతి నెలా 3వేల మందికి పైగా గర్భిణులను హాస్పిటల్కు, ఆ తర్వాత ఇంటికి చేరవేస్తూ రవాణా కష్టాలు తప్పించింది. ఫలితంగా మాతాశిశు మరణాలు తగ్గడమే గాక సర్కారు దవాఖానలో కాన్పు అయిన వారికి కేసీఆర్ కిట్తో పాటు అబ్బాయి పుడితే రూ.12వేలు, అమ్మాయి పుడితే రూ.13వేలు అందించడంపై ఆడబిడ్డల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
స్టేషన్ ఘన్పూర్, మే 19 : అమ్మఒడి పథకంలో బాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 102 వాహనం గర్భిణులకు, బాలింతలకు వరంగా మారింది. నాణ్యమైన వైధ్య సేవలందించడమే కాకుండా, ప్రతి నెల ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకునేందుకు గాను రవాణా కష్టాలు లేకుండా ఉచితంగా పరీక్షలు నిర్వహించి తిరిగి అదే వాహనంలో క్షేమంగా ఇంటికి చేరుస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారు ప్రతి నెల పరీక్షల కోసం ప్రైవేటు వాహనాల్లో వెళ్లేందుకు ఖర్చులు భరించలేక రెండు, మూడు నెలలకు ఒకసారి పరీక్షలు చేయించుకునే వారు. దీని మందులు సరిగా వాడకపోవడం, కాన్పు సమయం వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల బాలింత మరణాలు సంభవించేవి. ఈ సమస్యలను గుర్తించిన ప్రభుత్వం అమ్మఒడి ద్వారా గర్భిణులు, బాలింతలకు ప్రతి నెల ఆశవర్కర్ల సహాయంతో పరీక్షలు చేయిస్తోంది. వైధ్యుల సూచనల మేరకు మందులు వాడ డం వల్ల మరణాలు తగ్గడమే గాక తల్లీబిడ్డ క్షేమంగా ఉంటున్నారు.
ఒక్క వాహనంపై నెలకు రూ.30 ఖర్చు
జిల్లాలో 16 పీహెచ్సీలు, 104 సబ్ సెంటర్లు ఉన్నాయి. జిల్లాలోని జనగామ మండలానికి-2, స్టేషన్ ఘన్పూర్ 1, దేవరుప్పుల 1, నర్మెట 1, పాలకుర్తి 1, జఫర్గఢ్ మండలానికి ఒకటి కలిపి మొత్తం ఏడు వాహనాలు ఉన్నాయి. ప్రతి నెల ఒక్కో వాహనంపై సుమారు 30వేలకు పైగా ఖర్చవుతుంది. ఒక్కో వాహనంలో నెలకు సుమారుగా 3500మంది తరలిస్తుంటాం. వాహనంలో మినరల్ వాటర్, ఫస్ట్ ఎయిడ్ కిట్, డెలివరీ కిట్ అందుబాటులో ఉండడమే కాకుండా ఒక్క ఆశావర్కర్ కూడా పేషంట్లకు తోడుగా వస్తారు. గర్భిణులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆడియో వినిపిస్తాం. ఈ సేవలు పూర్తిగా ఉచితం. ఎవరైనా పేషంట్లను డబ్బులు అడిగితే వాహనంలో ఉన్న టోల్ ఫ్రీ నంబరకు ఫిర్యాదు చేయవచ్చు. గత నెలలో 934 ట్రిప్పుల ద్వారా 3346 మంది పేషంట్లను ఆసుపత్రికి తీసుకపోయి, తీసుకొచ్చాం. ప్రభుత్వాసుపత్రిలో కాన్పు అయి డిశ్చార్జి అయ్యేవారు రాష్ట్రంలో ఎక్కడి వారైనా అక్కడికి వారిని చేరవేస్తాం.
– శ్రీనివాస్, 102 వాహనం ఎమర్జెన్సి మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటీవ్
జాగ్రత్తగా చూసుకుంటారు..
నాకు ఇది రెండో కాన్పు. ప్రస్తుతం తొమ్మిది నెలలు నడుస్తున్నాయి. మొదటి నెల, రెండవ నెల మా గ్రామానికి చెందిన ఆశావర్కర్ 102 వాహనంలో స్టేషన్ఘన్పూర్లోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించి మందులు ఇప్పించింది. పైసా ఖర్చు లేకుండా నాతోపాటు మరికొంత మందిని క్షేమంగా తీసుకపోయి, తీసుకవచ్చారు. కాన్పు అయ్యేవరకు అవసరమైన మందులు ఇచ్చి జాగ్రత్తలు కూడా చెబుతున్నారు. 102 వాహనం లేకపోతే ఆసుపత్రికి వచ్చి చూయించుకోవడం చాలా కష్టమయ్యేది. బస్సు చార్జీలు మిగిలినయి. ఇంట్లో వారు ఎవరు తోడు రాకున్నా ఆశావర్కర్లతో పోయి వస్తున్నం.
– పొన్నబోయిన రజిత, గర్భిణి, చాగల్లు
తల్లీ బిడ్డ క్షేమం కోసమే..
తల్లీబిడ్డ క్షేమంగా ఉండాలనే రాష్ట్ర ప్రభుత్వం 102 వాహనం ప్రవేశపెట్టింది. ప్రతి సోమవారం, శుక్రవారం సుమారు 50 మంది వరకు గర్భిణులు , బాలింతలు వచ్చి వైద్య సేవలు పొందుతారు. దీంతో వారికి ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయి. ఇక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించలేరు. అనవసరపు ఆపరేషన్లు, మందులు వాడే అవసరం ఉండదు. ఈ వాహనంలో క్షేమంగా వచ్చి పోతున్నారు. దీని వల్ల బాలింత మరణాలు తగ్గడమే కాకుండా ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు.
– రవి రాథోడ్, స్టేషన్ ఘన్పూర్ వైధ్యాధికారి
జాబు చేయడం తృప్తిగా ఉంది..
102 వాహనంలో డ్రైవర్గా చేయడం ఎంతో తృప్తిగా ఉంది. నేను ప్రతి నెల సోమవారం, శుక్రవారం స్టేషన్ ఘన్పూర్ ఆసుపత్రికి, మిగితా రోజుల్లో జనగామలోని మతా శిశు సంరక్షణ ఆసుపత్రికి తీసుకపోయి తీసుకవస్తుంటాను. జనగామ ఆసుపత్రిలో కాన్పు అయిన వారిని డిశ్చార్జ్ సమయంలో ఇంటికి తీసుకరావడం, పుట్టిన శిశువులకు వ్యాక్సిన్ల కోసం మళ్ల్లీ ఆసుపత్రికి తీసుకొస్తాను. నెలకు సుమారు 5వేల కిలోమీటర్లు ప్రయాణిస్తా.
– జాడ రాజేశ్, 102 వాహన డ్రైవర్