ఖిలావరంగల్, సెప్టెంబర్ 5: చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటలో కొలువైన పోచమ్మతల్లి బోనాల పండుగను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఆదివారం తొలిపొద్దు నుంచి మొదలైన పూజలు.. బోనాలతో మొక్కులు చెల్లించడం వంటి కార్యక్రమాలు రాత్రి వరకూ కోలాహలంగా సాగాయి. ఈ సందర్భంగా పచ్చని తోరణాలు, వేపాకు మాలలతో అలంకరించిన కోట పురవీధులతో పాటు అండర్ రైల్వేగేటు ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. డప్పుదరువులు, తెలంగాణ పల్లెపాటలతో మైకుల మోతలు, శివసత్తుల పూనకాలు, బోనమెత్తిన ఆడపడుచులతో సాగిన ఊరేగింపు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచింది. పోశవ్వ తల్లికి ఉదయం నుంచి మహిళలు గంగా జలాలతోపాటు పసుపు, కుంకుమలతో అభిషేకాలు చేశారు. అనంతరం అమ్మవారికి సారెను సమర్పించి, నైవేద్యం పెట్టి మొక్కులు చెల్లించారు. కోటలోని అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు బోనాలతోపాటు వారి కులవృత్తులకు సంబంధించిన పరికరాలను వెంట తీసుకొని పోచమ్మతల్లి ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కోటలో అన్ని వర్గాల ప్రజలు ఒకేసారి ఈ ఉత్సవాన్ని నిర్వహించడంతో ఆ ప్రాంతమంతా జాతరను తలపించింది. కార్పొరేటర్ బైరబోయిన ఉమాదామోదర్యాదవ్ ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. మిల్స్కాలనీ పోలీసులు బందోబస్తు చేపట్టారు. శివనగర్, చింతల్, పుప్పాలగుట్ట, రుద్రమాంబనగర్లో కూడా బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ ఆధ్వర్యంలో అధికారులు ముత్యాలమ్మ ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ముగిసిన బోనాలు
శ్రావణమాసం సందర్భంగా వరంగల్ పోచమ్మమైదాన్లోని పోచమ్మ ఆలయంలో నెలరోజులపాటు జరిగిన బోనాల ఉత్స వం ఆదివారం ముగిసింది. ఆఖరి రోజు పోచమ్మ, కనకదుర్గమ్మ అమ్మవార్లను వివిధ రూపాల్లో అలంకరించారు. కరెన్సీ నోట్లు, నాణేలతో అలంకరించగా, భక్తులు దర్శించుకున్నారు.