దుగ్గొండి, ఏప్రిల్ 28 : కాపలా ఉండాల్సిన ఆ కుక్క.. యజమానికి చుక్కలు చూపించింది. మం చంపై ఉన్న డబ్బుల సంచిని నోటితో కరుచుకొని బయటికి పరుగుతీసి ఎక్కడో పారవేయడంతో లబోదిబోమనడం అతడి వంతైంది. ఆశ్చర్యపరిచే ఈ సంఘటన బుధవారం సాయంత్రం మండ లంలోని నాచినపల్లిలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన కాసు చేరాలు వృత్తి రీత్యా గొర్రెలు మేపుతూ వాటితో వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో బుధవారం కొన్ని గొర్రెలను విక్రయించగా రూ.1.50 లక్షలు వచ్చా యి. ఆ డబ్బులను తన నడుము చుట్టూ కట్టుకునే జోలె సంచిలో వేసుకొని ఇంటికి వచ్చాడు. ఇక స్నానం చేద్దామని జోలి సంచి తీసి మంచంపై పెట్టి వెళ్లాడు. తీరా వచ్చి చూస్తే సంచి లేకపోవడాన్ని గమనించి యజమాని అటుఇటూ వెతికాడు. తమ కుక్కే సంచి తీసుకెళ్లిందని తెలిసి వీధివీధినా గాలించాడు. కుటుంబసభ్యులంతా కలిసి కుక్కను తీసుకొని ఆ డబ్బుల కోసం జల్లెడ పడుతున్నారు. ఎవరికైనా దొరికితే ఇవ్వాలని వేడుకుంటున్నాడు. ఈ విషయం దావానంలా వ్యాపించడంతో ఊరి జనం కూడా గ్రామ పరిసరాల్లో వెతకడం ప్రారం భించారు. ఏదేమైనా యజమానికి నమ్మకంగా ఉండాల్సిన కుక్కే ఇలా నష్టం కలిగించేలా చేయడ మేమిటంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.