వరంగల్, ఆగస్టు 26(నమస్తేతెలంగాణ) : వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయ నిర్మాణం కోసం అడుగులు పడుతున్నాయి. వరంగల్ నర్సంపేట రోడ్డులోని ఓసిటీ వద్ద ఉన్న కలెక్టరేట్ నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని కలెక్టర్ హరిత గురువారం పరిశీలించారు. స్థానిక రెవెన్యూ అధికారుల నుంచి స్థలం వివరాలు తెలుసుకున్నారు. ఆజంజాహి మిల్లు స్థలం వద్ద ఉన్న స్థలంలో వరంగల్ జిల్లా కలెక్టరేట్ నిర్మించుకుందామని ఇటీవల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక్కడ 30 ఎకరాల స్థలం ఉంది. ప్రస్తుతం ఇది హ్యాండ్లూమ్, టెక్స్టైల్ శాఖ ఆధీనంలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ 30 ఎకరాల్లో 20 ఎకరాలు వరంగల్, 10 ఎకరాలు ఖిలావరంగల్ మండలం పరిధిలో ఉందని చెప్పారు. ఈ స్థలంతో సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం నిర్మించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నది. ఇందులో సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంతో పాటు కలెక్టర్ క్యాంపు ఆఫీసు, ఉన్నతాధికారుల క్వార్టర్ల నిర్మాణం చేపట్టాలని, డీసీపీ కార్యాలయ భవనం, పోలీసు పరేడ్ గ్రౌండ్కూ స్థలం కేటాయించాలనే ప్రతిపాదన ఉంది.
సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం, కలెక్టర్ క్యాంపు ఆఫీసు భవనం, క్వార్టర్లు నిర్మించే ప్రతిపాదిత స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. 30 ఎకరాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆమె వరంగల్, ఖిలావరంగల్ మండలాల రెవెన్యూ అధికారుల నుంచి తెలుసుకున్నారు. కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు కలెక్టరేట్ ప్రతిపాదిత స్థలంపై నివేదిక తయారు చేస్తున్నట్లు సమాచారం. వరంగల్ జిల్లా కలెక్టరేట్ నిర్మాణంపై బుధవారం ఉన్నత స్థాయిలో చర్చ జరిగినట్లు తెలిసింది. ఆమె వెంట వరంగల్ ఆర్డీవో మహేందర్జీతో పాటు వరంగల్, ఖిలావరంగల్ తాసిల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు ఉన్నారు.