గిర్మాజీపేట, ఫిబ్రవరి 7: అంధత్వ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. జిల్లాలో ప్రజలు స్వచ్ఛందంగా శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 87,033 మందికి పరీక్షలు చేయగా, అందులో 18,603 మందికి రీడింగ్ గ్లాసులు అందజేశారు. 10,991 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసుల కోసం ఆర్డర్ చేశారు. ఈ ప్రోగ్రాం నిర్వహణలో రాష్ట్రంలో జిల్లా స్థానంలో ఉన్నట్లు డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ వెల్లడించారు.
కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంటి పరీక్ష శిబిరాలు కొనసాగుతున్నాయి. కార్యక్రమ ప్రారంభం నుంచి ఇప్పటివరకు జిల్లాలో 87,033 మందికి కంటి పరీక్షలు చేసినట్లు డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ తెలిపారు. అందులో 18,603 మందికి రీడింగ్ గ్లాసులు అందజేశామని పేర్కొన్నారు. 10,991 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసుల కోసం ఆర్డర్ ఇచ్చామని, అవి రాగానే వెంటనే అందజేస్తామని పేర్కొన్నారు. కంటి వెలుగు ప్రోగ్రాం నిర్వహణలో జిల్లా ఆరో స్థానంలో ఉందని వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, సంబంధిత డిపార్ట్మెంట్ సిబ్బంది, స్పెషలాఫీసర్లు, వైద్యాధికారులు, ఆరోగ్యశాఖ సిబ్బంది, ఆశాకార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారని ఆయన తెలిపా రు.
కంటివెలుగు శిబిరాలను రోజూ ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు నిర్వహిస్తున్నామని, ఏవైనా సమస్యలు ఉంటే ఎమర్జెన్సీ మానిటరింగ్ సెల్ సెంటర్ నుంచి పరిష్కారాలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారని వివరించారు. కంటి వెలుగు శిబిరాలు జిల్లాలో 22 గ్రామపంచాయతీలు, 7వార్డుల్లో పూర్తయ్యాయని, మిగతా 25 గ్రామపంచాయతీలు, 19వార్డుల్లో త్వరలోనే పూర్తి చేస్తామని డీఎంహెచ్వో తెలిపారు. కంటిపరీక్షలు మొత్తం 87,033 మందికి చేయగా, అందులో 40,047 మంది పురుషులకు, 46,978 మంది స్త్రీలు, ఎనిమిది ట్రాన్స్జెండర్లు పేర్కొన్నారు. 14,659 ఎస్సీలకు, 6,488 ఎస్టీలకు, 59,080 బీసీలకు, 4,213 ఓసీలకు, 2,586 మైనార్టీలకు కంటిపరీక్షలు చేసినట్లు డీఎంహెచ్వో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో 57,439 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని డీఎంహెచ్వో తెలిపారు.
వినియోగించుకోవాలి
ఖానాపురం : కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు అన్నారు. మంగళవారిపేటలో మంగళవారం ఆయన కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారని కొనియాడారు. రాష్ట్రంలో అంధత్వ నివారణే ధ్యేయంగా ముఖ్యమంత్రి ముందుకెళ్తున్నారన్నారు. గ్రామాల్లోనే కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు, మందులు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, సర్పంచ్ లావుడ్యా రమేశ్నాయక్, ఉపసర్పంచ్ ఉపేందర్, ఎంపీటీసీ పూల్సింగ్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పైండ్ల యాదగిరి, గొంది నాగేశ్వర్రావు, నర్సయ్య, శ్రీశైలం, కేశవులు, లింగ్యానాయక్, రమేశ్, ఐసీడీఎస్ సూపర్వైజర్ మాధవి, అంగన్వాడీ వర్కర్స్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కంటి వెలుగు శిబిరం పరిశీలన
నర్సంపేటరూరల్: భోజ్యానాయక్తండా, ఆకులతండాలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాలను ఎంపీడీవో ఒరంగంటి ఇంద్రసేనారెడ్డి పరిశీలించారు. 18 ఏళ్ల పైబడిన వారు స్క్రీనింగ్ టెస్టుకు రావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అజ్మీరా మౌనిక, సర్పంచ్లు భూక్యా లలిత, బానోత్ రాము, వైద్యాధికారి బానాల అరుణ్చంద్ర, కంటి వెలుగు క్యాంపు ఇన్చార్జి డాక్టర్ కవిత, కార్యదర్శి అనిల్కుమార్, వైద్య సిబ్బంది, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
కంటి సమస్యలను పరిష్కరించుకోవాలి
గీసుగొండ: కంటి సమస్యలతో బాధపడుతున్న వారు కంటి వెలుగు ద్వారా తమ కళ్లకు పరీక్షలు చేసుకోవాలని సర్పంచ్ రాచబోయిన రజిత అన్నారు. మండలంలోని శాయంపేట గ్రామంలో మంగళవారం కంటి వెలుగు ప్రోగ్రాంను సర్పంచ్ ప్రారంభించి మాట్లాడారు. గ్రామంలో 20 రోజుల పాటు కంటి పరీక్షలు చేస్తారని తెలిపారు. గ్రామంలో కళ్ల సమస్యలు ఉన్న వారు పరీక్షలు చేసుకొని అద్దాలు పొందాలని సూచించారు. వైద్యాధికారి చరిష్మా, ఉపసర్పంచ్ అరుణ, సిబ్బంది పాల్గొన్నారు.