హనుమకొండ చౌరస్తా, జనవరి 28: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధించేవరకూ కేంద్రంపై పోరాటం చేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ హెచ్చరించారు. హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్క్లబ్లో శుక్రవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ వినయ్భాస్కర్ మాట్లాడుతూ ఉద్యమాల గడ్డ ఓరుగల్లు నుంచి కేంద్రంపై ఉద్యమానికి సమర శంఖం పూరిస్తామని హెచ్చరించారు. కేంద్రం వెంటనే విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలన్నారు. కోచ్ ఫ్యాక్టరీతో పాటు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ములుగు జిల్లాకు ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాజీపేటలో 152 ఎకరాల స్థలం కేటాయించామని, ఎండోమెంట్ పరిధిలో ఉన్న భూమికి నష్టపరిహారం సైతం చెల్లించామని గుర్తుచేశారు. అయినా కేంద్రం నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కోచ్ ఫ్యాక్టరీ కోసం కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని పోరాడుతామన్నారు. కోచ్ఫ్యాక్టరీ సాధన కోసం కాజీపేట చౌరస్తాలో శనివారం ఉదయం 11 గంటలకు అన్ని పార్టీలతో కలిసి రాస్తారోకో చేయనున్నట్లు తెలిపారు. అలాగే, ఈ నెల 31న సికింద్రాబాద్లోని రైల్వే జీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని వినయ్భాస్కర్ తెలిపారు. ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ కోసం టీఆర్ఎస్ ఎంపీలమంతా పోరాటం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, సీపీఎం, సీపీఐ నాయకులు ఎం చుక్కయ్య, మేకల రవి, నున్న అప్పారావు, నార్లగిరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.