వరంగల్ చౌరస్తా, జూన్ 8 : వరంగల్ స్టేషన్ రోడ్డులోని ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల షాపుల్లో విజిలెన్స్, వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు చేశారు. మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో అనుమతులు లేని విత్తనాలు ఏమీ పట్టుబడలేదని వారు తెలిపారు. నకిలీ విత్తనాల నివారణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ బృందం అధికారులు సీఐ నందీరాం నాయక్, వ్యవసాయాభివృద్ధి అధికారి అనిత, విత్తన ధ్రువీకరణ అధికారి విజయ్, ఏవో విజ్ఞాన్ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విత్తనాల విషయంలో ఎలాంటి నాణ్యత లోపాలు కనిపించినా వెంటనే అధికారులకు సమాచారం అందజేయాలని వారు సూచించారు.
కాజీపేటలో..
కాజీపేట : కాజీపేట బాపూజీనగర్లోని ఎరువులు, విత్తనాల దుకాణాన్ని టాస్క్ఫోర్స్ అధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాపులోని స్టాక్ రిజిస్టర్, విత్తన నిల్వలను పరిశీలించారు. అనంతరం హెచ్టీ కాటన్ టెస్ట్లను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ ఏడీ అనిత మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. తనిఖీల్లో ఏవో శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఐనవోలు మండలంలో..
ఐనవోలు : మండలంలోని ఐనవోలు, వెంకటాపురం, కొండపర్తి గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను విత్తనాల ధ్రువీకరణ సంస్థ ఏడీ సౌమ్య, టాస్క్ఫోర్స్ జిల్లా ఇన్చార్జి శ్రీనివాస్తో కలిసి ఏడీఏ దామోదర్రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లోని విత్తనాలు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో ఏవో అడుప కవిత, ఏఈవోలు పాల్గొన్నారు.