అమరావతి : వైఎస్ వివేకానందా రెడ్డి ని హత్య చేసిన నిందితులు మళ్లీ చట్టసభల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడానికే తాను కడప ఎంపీ (Kadapa MP) గా పోటీ చేస్తున్నానని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila) తెలిపారు. వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గం వడ్డమాను గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. వైఎస్ వివేకా (YS Viveka) ను చంపిన అవినాష్రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు.
వివేకా హత్యలో సాక్ష్యాలున్నాయని సీబీఐ (CBI) చెబుతున్నా అవినాష్రెడ్డికి మరోసారి వైసీపీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం దారుణమని విమర్శించారు. హత్యకు గల కారకులు ఎన్నికల్లో గెలిస్తే పదవిని అడ్డం పెట్టుకుని తప్పించుకు తిరుగుతారని అన్నారు. వివేకాకు న్యాయం జరుగాలంటే కడప ఎంపీగా తాను పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు.
ఎంపీగా పోటీచేస్తున్న వైఎస్సార్ బిడ్డ కావాలో, వివేకా హత్యలో పాత్ర దారి అయిన అవినాష్రెడ్డి (Avinash reddy) కావాలో తేల్చుకునే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. కడపలో న్యాయాన్ని బతికించాలని , నన్ను గెలిపిస్తే నా జీవితాన్ని కడప నియోజకవర్గ ప్రజలకు అంకితం చేస్తానని అన్నారు.