వర్ధన్నపేట/రాయపర్తి, మే 19 : కరోనా నేపథ్యంలో వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని జిల్లా కలెక్టర్ ముండ్రాతి హరిత హెచ్చరించారు. బుధవారం వర్ధన్నపేటలోని సీహెచ్సీని, రాయపర్తిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి తాళ్లపల్లి మధుసూదన్తో కలసి ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్, కరోనా పరీక్షలు, మందుల పంపిణీ, రోగులకు వైద్య సేవలు, కరోనా బాధితుల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరిత మాట్లాడుతూ కరోనాను భయపడాల్సిన అవసరం లేదని, బాధితులకు వైద్యులు, సిబ్బంది అండగా ఉండాలని కోరారు. కరోనాను కట్టడి చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో లాక్డౌన్ను అమలు చేస్తున్నట్లు హరిత చెప్పారు. మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యారోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించడంతోపాటు మనోధైర్యాన్ని నింపేందుకు కృషి చేయాలని కోరారు.
మరో వైద్యుడిని రాయపర్తికి పంపిస్తా..
రాయపర్తిలోని 24 గంటల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒకే వైద్యుడువిదులు నిర్వర్తిస్తున్నాడని, మండలంలోని 39 గ్రామాలు, 11 సబ్ సెంటర్లతోపాటు వర్ధన్నపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 10 సబ్ సెంటర్ల బాధ్యతలు చూడాల్సి రావడంతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, సర్పంచ్ గారె నర్సయ్య కలెక్టర్ హరిత దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన హరిత వెంటనే రాయపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మరో వైద్యుడిని డిప్యుటేషన్పై పంపిస్తానని చెప్పారు.
ధాన్యం కొనుగోళ్లపై సమీక్షలు జరుపాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాల స్థితిగతులపై కలెక్టర్ రాయపర్తి తహసీల్దార్ కుసుమ సత్యనారాయణతో చర్చించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని గోదాములకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట సీహెచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింహస్వామి, రాయపర్తి మండల వైద్యాధికారి డాక్టర్ భూక్యా వెంకటేశ్, ట్రైనీ ఎస్సై వొడుదుల శ్రీలత, ఏఎస్సై సదయ్య, ఎడ్ల రవీందర్, ల్యాబ్ టెక్నీషియన్ ఆకినేపల్లి ప్రభాకర్, వైద్యారోగ్య సిబ్బంది ధరావత్ భీమానాయక్, బాసాని మథ్యాస్రెడ్డి, స్వర్ణకుమారి, ఉబ్బని రజిత, పూస మధు, ఎండీ.నయీం, తక్కళ్లపల్లి రవీందర్రావు, సూదుల దేవేందర్రావు, బాషబోయిన సుధాకర్యాదవ్, పెదగాని సంతోష్కుమార్గౌడ్ పాల్గొన్నారు.