కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
111 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
శాయంపేట, మే 4: కరోనా వల్ల రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నా సంక్షేమ పథకాలు ఆగకుండా సీఎం కేసీఆర్ అన్ని చర్యలు తీసుకుంటున్న తీరు ఆదర్శనీయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని తహార్పూర్, శాయంపేట, ప్రగతిసింగారం, నేరేడుపల్లి, కాట్రపల్లి, కొప్పులకు చెందిన 111 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు మంగళవారం ఎమ్మెల్యే ఆయా గ్రామాలకు వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా ప్రభావం రాష్ట్ర ఖజానాపై పడినా లబ్ధిదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. కరోనా తీవ్రతను అందరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితిపై కలెక్టర్తో మాట్లాడినట్లు చెప్పారు. ఇంట్లో సరైన సౌకర్యాలు లేని కరోనా బాధితులు కేజీబీవీలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ సెంటర్లో చేరాలన్నారు.
తాగునీటి సమస్య పరిష్కారం
గతంలో వేసవి వచ్చిందంటే చాలు.. గ్రామాల్లో తీవ్ర తాగునీటి సమస్య ఉండేదని ఎమ్మెల్యే అన్నారు. కానీ, నేడు తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా ద్వారా నీరు అందిస్తున్నదన్నారు. రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడమే కాకుండా భూమి శిస్తును ప్రభుత్వమే చెల్లిస్తున్నదని గుర్తుచేశారు. ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నదని తెలిపారు.
ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ
శాయంపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో అటెండర్, సూపర్వైజర్ మాత్రమే విధుల్లో ఉన్నారు. వైద్య సిబ్బంది అటెండెన్స్, ఓపీ రిజిస్టర్ను పరిశీలించారు. వైద్యాధికారి నాగశశికాంత్ విధులకు రాకపోవడంతో ఎమ్మెల్యే ఫోన్ చేసి మాట్లాడారు. నిర్లక్ష్యం తగదని, అందరూ సమయపాలన పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, తహసీల్దార్ పోరిక హరికృష్ణ, ఎంపీడీవో అమంచ కృష్ణమూర్తి, వైస్ ఎంపీపీ రాంశెట్టి లత, పీఏసీఎస్ చైర్మన్ శరత్, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్రెడ్డి, పోలెపల్లి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
తహార్పూర్, నేరేడుపల్లి, కొప్పుల, జోగంపల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యంలో రాళ్లు, మట్టి లేకుండా, 17 శాతంలోపు తేమ ఉండేలా చూసుకోవాలని రైతులను కోరారు. కేంద్రం వ్యాపారులకే ధాన్యం అమ్ముకోవాలని చట్టం చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో ప్రతి గ్రామంలోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయిస్తున్నారని తెలిపారు. సర్పంచ్లు ఆకుతోట రాజేశ్, సమ్మిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
108 అంబులెన్స్ అందించాలి
శాయంపేటకు 108 అంబులెన్స్ను అందించాలని బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మారెపల్లి క్రాంతికుమార్ కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట సంఘం ప్రధాన కార్యదర్శి మొగ్గం సుమన్ ఉన్నారు.