దళితబంధు పథకాన్ని పక్కాగా అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించామని, లబ్ధిదారుల ఎంపిక పూర్తవగానే యూనిట్లు గ్రౌండింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వరంగల్ కలెక్టర్ బీ గోపి వివరించారు. పథకం అమలుపై అధికారులతో ఇప్పటికే సమావేశం నిర్వహించామని, జిల్లా స్థాయి జాయింట్ అకౌంట్ కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. యూనిట్ల ఎంపికపై లబ్ధిదారులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని, వారు కోరుకున్న వాటిని విడివిడిగా లేదా కలిపి గ్రౌండింగ్ చేస్తామని చెప్పారు. ఈ మేరకు ఆయన ‘నమస్తే’కు మంగళవారం ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.
నమస్తే : జిల్లాలో దళితబంధు అమలు ఎంతవరకు వచ్చింది?
కలెక్టర్ : ఇప్పటికే జిల్లా అధికారులో సమావేశం నిర్వహించాం. ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. ఎంపిక పూర్త్తికాగానే కార్యక్రమాన్ని అమలు చేస్తాం. ఇప్పటికే జిల్లాస్థాయిలో జాయింటు అకౌంట్ క్రియేట్ అయింది. లబ్ధిదారుల జాబితా రాగానే వ్యక్తిగత అకౌంట్లు ఓపెన్ చేస్తాం.
నమస్తే : పథకం అమలుకు క్షేత్రస్థాయి ప్లానింగ్ ఎలా ఉండబోతున్నది?
కలెక్టర్ : ఎంపికైన లబ్ధిదారులతో సమావేశం నిర్వహిస్తాం. వారితో గ్రామ, మండల స్థాయి కమిటీలు వేస్తాం. జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడిస్తాం. పరిశ్రమలు, డెయిరీ, వ్యవసాయ శాఖ సహా ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు వారికి యూనిట్లపై అవగాహన కల్పిస్తారు. ఏ యూనిట్ పెట్టుకునేందుకు అవకాశం ఉందో వివరిస్తారు. ఇలా మూడు, నాలుగు మీటింగ్లు ఉంటాయి. క్షేత్రస్థాయి ప్రదర్శనలు కూడా ఉంటాయి. వారు ఎంపిక చేసుకున్న యూనిట్కు సంబంధించి నిర్వాహకులతో మాట్లాడిస్తాం. నమ్మకం వచ్చాక లబ్ధిదారుల్లో ఎవరు ఏ యూనిట్ పెట్టేందుకు సుసుఖంగా ఉన్నారో చూసి గ్రౌండింగ్ చేస్తాం.
నమస్తే : అర్హుల ఎంపికకు తీసుకుంటున్న ప్రామాణికాలు ఏమిటి?
కలెక్టర్ : ఈ పథకంతో ఎస్సీలందరికీ మేలు జరుగుతుంది. కాకపోతే కొందరికి ముందు కొందరికి వెనుక. ఈ ఏడాది మార్చి ఆఖరులోగా తొలివిడత ప్రతి నియోజకవర్గంలో 100మందికి యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేస్తాం. వచ్చే సంవత్సరం మరో 2వేల మందికి ఇస్తామని చెప్తున్నారు. ఈ ఏడాది ఏ గ్రామంలో ఎవరికి ముందు ఎవరికి వెనుకాల అనేది ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారు. జిల్లాలో ఐదు శాసనసభ నియోజకవర్గాల పరిధి ఉంది. వరంగల్ తూర్పు, నర్సంపేట నియోజకవర్గాలపై స్పష్టత ఉంది. ఇతర మూడు నియోజకవర్గాలు పరకాల, వర్ధన్నపేట, పాలకుర్తికి సంబంధించి ఎమ్మెల్యేలు సెలెక్ట్ చేసే లబ్ధిదారుల జాబితా ప్రకారం ఫాలో అవుతాం.
నమస్తే : యూనిట్ల పంపిణీలో ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తారా? స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రతిపాదనలు ఉంటాయా?
కలెక్టర్ : యూనిట్ల ఎంపికలో లబ్ధిదారులు పేర్కొన్నదే ఫైనల్. వారు కోరుకున్న యూనిట్లను గ్రౌండింగ్ చేస్తాం. ఒకరు, లేదా నలుగురైదుగురు కలిసి యూనిట్ పెట్టుకోవచ్చు. ఐదుగురు కలిసి రూ.50 లక్షలతో ఒక యూనిట్ స్థాపించుకోవచ్చు. పది మంది లబ్ధిదారులు కలిసి కూడా సూపర్ మార్కెట్ వంటి యూనిట్ పెట్టాలనుకుంటే అవకాశం ఇస్తాం. వేర్వేరుగా యూనిట్ తీసుకున్నా అందరూ కలిసి యూనిట్ పెట్టుకున్నా గ్రౌండింగ్ చేస్తాం. ఒకరికి వచ్చే రూ.10 లక్షలతో పెద్ద యూనిట్లు పెట్టుకోవడం సాధ్యం కాదు. అందుకే నలుగురైదుగురు కలిసి తమకు వచ్చే మొత్తంతో యూనిట్ పెట్టుకుంటే ప్రయోజనం ఉంటుంది.
నమస్తే : పథకం అమలులో ఎమ్మెల్యేల పాత్ర ఏమిటి?
కలెక్టర్ : లబ్ధిదారులను పూర్తిగా ఎమ్మెల్యేలే ఎంపిక చేస్తారు. గ్రౌండింగ్ ఏ గ్రామం నుంచి ఎవరికి ముందు, ఎవరికి వెనుక అనేది కూడా వారే నిర్ణయిస్తారు. ఆల్రెడీ లబ్ధిదారుల జాబితా ఇవ్వడం జిల్లాలో మొదలైంది.
నమస్తే : దళితబంధు అమలుకు కో ఆర్డినేషన్ మీటింగ్ ఉంటుందా?
కలెక్టర్ : లబ్ధిదారులతో గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. గ్రామ, మండల కమిటీల ఏర్పాటుపై స్పష్టత ఉన్నా జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటుపై క్లారిటీ రావాల్సి ఉంది. జిల్లా స్థాయి కమిటీలో అన్ని మండలాల భాగస్వామ్యం ఉండాలి. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా వంద మందికి దళితబంధు యూనిట్లు అందించే కార్యక్రమం మొదలైంది. ఈ క్రమంలో తొలివిడత ఎంపికైన వంద మంది లబ్ధిదారులతోనే జిల్లా కమిటీ ఏర్పాటు చేయాలా?, అన్ని మండలాల లబ్ధిదారులు ఉండేలా చూడాలా అనేదానిపై గైడ్లైన్స్ రావాలి. క్లారిటీ వచ్చాక కోఆర్డినేషన్ మీటింగ్పై ప్లాన్ చేస్తాం.
నమస్తే : లబ్ధిదారుల ఎంపిక ఎప్పటివరకు పూర్తవుతుంది?
కలెక్టర్ : షెడ్యూల్ ప్రకారం దళితబంధు పథకం నుంచి తొలి విడత ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మార్చిలోగా 100మంది లబ్ధిదారులకు యూనిట్లు అందించాల్సి ఉంది. ఒక్కో లబ్ధిదారుకు అందజేసే యూనిట్ విలువ రూ.10 లక్షలు. లబ్ధిదారుల ఎంపికకు మరో పది రోజుల సమయం ఉంది. ఫిబ్రవరి మొదటి వారంలోగా ఎంపిక పూర్తవుతుంది. ఈ నెలాఖరులోనే కొన్ని నియోజకవర్గాల నుంచి జాబితా అందే అవకాశముంది. ఎంపిక పూర్తయిన వెంటనే ఫిబ్రవరిలో లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించి బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేసి యూనిట్లు గ్రౌండింగ్ చేస్తాం. మార్చి 7లోగా యూనిట్లు పంపిణీ చేయాలనేది టార్గెట్.