వరంగల్ చౌరస్తా : వరంగల్ స్టేషన్ రోడ్లోని కాశీ విశ్వేశ్వరాయలంలో కార్తీకమాస శుక్ల తదియను పురస్కరించుకుని లోక కల్యాణార్థం వీరభద్ర సేవా సమితి ఆధ్వర్యంలో అక్షరకోటి పంచాక్షరీ జపము, పూర్వాంగమైన హోమం నిర్వహించారు. ఆదివారం ఉదయం వీరభద్ర సేవా సమితి అధ్యక్షుడు అన్నదేవర పవనారాధ్య, ముదిగొండ రవిశంకర్, ఫణీష్ల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ముందుగా స్వస్తి వాచనము, మంగళ ధ్వని, గోపూజా, గురుప్రార్థన, గణపతి హోమం నిర్వహించారు. శతకోటి దేవతలను ఆహ్వానిస్తూ విశేష పూజా కార్యక్రమాలు చేశారు.
128 కలశాలను శివలింగాకృతిలో కైలాస యంత్ర కలశ స్థాపనలు చేసి తదనంతరం కాశీవిశ్వేశ్వరుడికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం పంచాక్షరీ మూలమంత్ర హవనము ప్రారంభించి సాయంత్రం పూర్ణాహుతి, ఆశీర్వచన కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు లంకా శివకుమార్, సతీష్చంద్ర, ఆలయ సేవా సమితి సభ్యులు భక్తులు పాల్గొన్నారు.