వరంగల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఎన్నికల సమన్వయ కమిటీ అధ్యక్షుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పార్టీ నేతలకు సూచించారు.
హన్మకొండలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఇంట్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిస్థితులపై చర్చించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి గ్యాదరి బాలమల్లు, మాజీ ఎంపీ గుండు సుధారాణి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గెలిచే అభ్యర్థులకే టిక్కెట్లు ఇచ్చామన్నారు. ‘‘అన్ని సర్వేలు టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నాయి.
బోగస్ మాటల బీజేపీ అడ్రస్ గల్లంతు చేయాలి. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉనికే లేదు. అభివృద్ధి, సంక్షేమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ టీఆర్ఎస్ మాత్రమే. వరంగల్ నగరాభివృద్ధికి ప్రభుత్వం ఎంతగానో పాటు పడుతుంది.
మంత్రి కేటీఆర్ ఇటీవల రూ. 2వేల 500 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో ప్రతిపక్షాల దిమ్మ తిరిగింది’’ అని మంత్రి అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి