హనుమకొండ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ద్వారా గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli) అన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (Junior Panchayat Secretaries ) క్రమబద్ధీకరణలో భాగంగా హనుమకొండ కలెక్టరెట్ కార్యాలయంలో ఆదివారం పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-4 నియామక ఉత్తర్వులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాక ముందు 8,690 గ్రామ పంచాయతీలు ఉండగా కేవలం 3,414 మంది గ్రామ కార్యదర్శులు (Panchayat Secretaries) ఉండే వారని, ఫలితంగా గ్రామాలలో అభివృద్ధి కుంటు పడిందని తెలిపారు. ఈ దుస్థితి ని మార్చేందుకు 9,355 మంది కార్యదర్శులను కొత్తగా నియమించడంతో మొత్తం 12,769 మంది పని చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రం లో 8,900 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పని చేస్తుండగా ఇప్పటివరకు 4,600 మందిని రెగ్యులర్ చేశామని వివరించారు.
పల్లె ప్రగతి ద్వారా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేశామని వివరించారు. పాత పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించి తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ద్వారా ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి ని తెలంగాణలో చేసి చూపించామని పేర్కొన్నారు. కేంద్రంతో సమానంగా ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుందని అన్నారు. పల్లె ప్రగతి ( Palle Pragathi ) ద్వారా పాలకులు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పని తీరు వల్ల ఎక్కడ చూసినా అభివృద్ధి కనపడుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) ఒక విజన్తో పనిచేస్తున్నారని వెల్లడించారు.