కాజీపేట : కాజీపేట పట్టణం 62వ డివిజన్ పరిధిలోని సోమిడిలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ ఇల్లు నేలమట్టమైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక యాదవనగర్లో మేకల శ్రీనివాస్, అతడి భార్య, ఇద్దరు పిల్లలు, తల్లీ, సోదరితో నివసిస్తున్నాడు. ఇంటి సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో పూజలు చేసేందుకు ఆదివారం రాత్రి ఇంటి సభ్యులతో కలిసి మండపానికి వెళ్లారు. సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షంతో ఇంటికి రాకుండా మండపంలోనే ఉండిపోయారు. రాత్రి ఒకేసారి భారీ శబ్ధంతో ఇల్లు కూలీ నేలమట్టమైందన్నారు.
స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న బాధితుడు మేకల శ్రీనివాస్ ఇంటికి చేరుకుని బోరున విలపించాడు. ఇల్లు పూర్తిగా నేలమట్టం కావడంతో ఇంట్లోని వస్తువులన్నీ పనికిరాకుండా పోయాయని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. నిరుపేద అయిన మేకల శ్రీనివాస్ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసి ఆదుకోవాలని స్థానికులు కోరారు.