హనుమకొండ చౌరస్తా, జూన్ 16: రాష్ట్ర స్ప్రింట్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో గురువారం హోరాహోరీగా జరిగాయి. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. అండర్-12, 14, 16, 18, 20 విభాగాల్లో బాలబాలికలకు 100, 200, 400 మీటర్ల పరుగుపందెం పోటీలు నిర్వహించారు. 33 జిల్లాల నుంచి 472 మంది క్రీడాకారులు ‘నువ్వా-నేనా’ అన్నట్లు తలపడ్డారు. 33 ఈవెంట్లలో విజేతలకు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ పతకాలను అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చీఫ్విప్ దాస్యం మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడాకారులను సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. క్రీడల మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచనల మేరకు ప్రత్యేక క్రీడా పాలసీని రూపొందించినట్లు తెలిపారు.
హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్నుస్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాలు పూర్తయిన తర్వాత కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజీవ్గాంధీ అధ్యక్షతన పోలీస్ కమిషనర్ తరుణ్జోషి, అన్ని అసోసియేషన్ కార్యదర్శులతోపాటు క్రీడాకారులతో జిల్లా యంత్రాంగం సమావేశం నిర్వహించి ప్రతి నెలా ఒక ఈవెంట్ నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. స్పాన్సర్స్ కూడా ముందుకు వచ్చి క్రీడాకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. జేఎన్ఎస్లో పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, క్రీడాకారులకు వాతావరణం అనుకూలించిందన్నారు. క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సారంగపాణి మాట్లాడుతూ జనవరి, ఫిబ్రవరిలో అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తామని ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ అజీజ్ఖాన్ మాట్లాడుతూ అనేక క్రీడాపోటీలకు వరంగల్ వేదికగా నిలుస్తోందన్నారు. ఇలాంటి పోటీలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వరద రాజేశ్వర్రావు మాట్లాడుతూ మొదటిసారిగా నిర్వహిస్తున్న తెలంగాణ స్ట్రేట్ స్ప్రింట్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో అథ్లెట్లు ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పారు. వారికి అసోసియేషన్ తరఫున అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు. క్రీడాకారుల్లో ప్రతిభను గుర్తించేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. కార్యక్రమంలో డీవైఎస్వో గుగులోతు అశోక్కుమార్, కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, జూడో కార్యదర్శి కైలాస్యాదవ్, టీఆర్ఎస్ నాయకులు పులి రజినీకాంత్, కందుల సృజన్ కాంత్, ఐలి చంద్రమోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.