వరంగల్ అర్బన్ : సంఘటిత, అసంఘటిత రంగంలోని కార్మికుల సంక్షేమం నిమిత్తం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని.. కార్మికులంతా వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కోరారు. భవన నిర్మాణ, ఇతర రంగాల కార్మికులు తమ పేర్లను తెలంగాణ బిల్డింగ్, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు వద్ద నమోదు చేసుకోవాలన్నారు.
అదేవిధంగా ప్రభుత్వం అందించే బీమా పాలసీలను కూడా తీసుకోవాలన్నారు. బీమా పథకాలకు ప్రీమియం చెల్లించలేని స్థితిలో ఉంటే తన కార్యాలయానికి వస్తే వారి తరపున డబ్బు చెల్లిస్తామని ఆయన తెలిపారు. హన్మకొండలోని మార్కాజీ స్కూల్లో శనివారం జరిగిన మే డే వేడుకల్లో వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. జెండాను ఆవిష్కరించి అనంతరం కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు.