Abuse-Free Village : అది పూర్తిగా బూతుల రహిత గ్రామం..! ఆ గ్రామంలో బూతులు మాట్లాడటంపై నిషేధం ఉంది..! నిషేధాన్ని ఉల్లంఘించి ఎవరైనా బూతులు మాట్లాడితే వారి జేబుకు చిల్లుపడినట్లే. ఏకంగా రూ.500 జరిమానా కట్టాల్సిందే. ఈ మేరకు ఆ గ్రామ పంచాయతీ తీర్మానం కూడా ఉంది. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని గ్రామ పెద్దలు చెప్పారు.
సాధారణంగా గ్రామాల్లో అయినా, పట్టణాల్లో అయినా గొడవలు జరుగుంటాయి. ఈ గొడవల సందర్భంగా బూతులు కూడా దొర్లుతాయి. ఇలా బూతులు జారడంవల్ల చిన్న గొడవలు కూడా పెద్దవిగా మారుతాయి. అందుకే మధ్యప్రదేశ్ రాష్ట్రం బుర్హాన్పూర్ జిల్లాలోని బోర్సర్ గ్రామంలో బూతులపై పూర్తిగా నిషేధం విధించారు. నిషేధాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే రూ.500 జరిమానా విధించనున్నట్లు ప్రకటించారు.
బుర్హాన్పూర్ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరాన ఉన్న ఈ గ్రామంలో 6 వేల మంది జనాభా ఉంటారు. గ్రామంలో ధనిక, పేద తేడా లేకుండా ఎవరు బూతులు మాట్లాడినా రూ.500 జరిమానా విధిస్తారు. ఒకవేళ జరిమానా కట్టకపోతే గంటసేపు గ్రామంలో పారిశుధ్య పనులు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు గ్రామమంతా పోస్టర్లు వేయించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
కాగా, బూతులతో గొడవలు పెద్దవి చేసుకోకుండా ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నామని, ప్రత్యేక బృందాలతో పర్యవేక్షణ చేయిస్తున్నామని సర్పంచి అంతర్సింగ్ తెలిపారు. గ్రామంలో గ్రంథాలయం కూడా ఏర్పాటు చేశామని, అదేవిధంగా నాలుగుచోట్ల ఉచిత వైఫై సదుపాయం, గ్రామం అంతటా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు.