JD Vance : ఇరాన్తో శాంతి చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) నేతృత్వంలోని బృందం పాకిస్థాన్ చేరుకుంది. మరికొన్ని గంటల్లో ఇరుదేశాల ప్రతినిధుల మధ్య ఇస్లామాబాద్ కేంద్రంగా పాక్ ప్రధాని, సైనికాధ్యక్షుడి సమక్షంలో చర్చలు జరుగనున్నాయి. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య 1979 తర్వాత దౌత్యపరమైన భేటీ జరగడం ఇదే మొదటిసారి. అయితే.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల దృష్ట్యా అమెరికా నుంచి వాన్స్ బృందానికి రక్షణగా పాక్ తమ ఎఫ్ -16 యుద్ధ విమానాలను పంపింది.
పశ్చిమాసియాలో యుద్ధానికి రెండు వారాలు విరమణ ప్రకటించిన ఇరాన్, అమెరికా చర్చలకు సిద్ధమయ్యాయి. ఇరాన్ ప్రతినిధులతో దౌత్యపరమైన చర్చల కోసం యూఎస్ఏ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో కూడిన బృందం శుక్రవారం రాత్రి అమెరికా యుద్ధ విమానం బోయింగ్ C-32Aలో పాకిస్థాన్ బయల్దేరింది. వాన్స్ టీమ్ ప్రయాణిస్తున్న విమానానికి రక్షణగా పాక్ తమ ఎఫ్-16 యుద్ధ విమానాలను పంపింది. ఏకంగా ఐదు విమనాలు (ఒకపైపు రెండు, మరోవైపు మూడు) ఎస్కార్ట్గా ఉండి బోయింగ్ C-32Aను సురక్షితంగా ఇస్లామాబాద్కు తీసుకొచ్చాయి.
🇺🇸🇮🇷🇵🇰 Footage of Pakistani fighter jets escorting JD Vance to Islamabad.
Iran sent 3 planes when their negotiating team flew in, 2 of which were decoys, in case Netanyahu got any ideas about trying to assassinate them.pic.twitter.com/Sr9oJFLgff https://t.co/bsB5dbcuMU
— Mario Nawfal (@MarioNawfal) April 11, 2026
‘ఇస్లామిక్ రెవల్యూషన్’ (1979 ) అనంతరం అమెరికా, ఇరాన్ మధ్య తొలిసారి జరుగుతున్న దౌత్యపరమైన చర్చలు ఇవే. అమెరికా ప్రతినిధులుగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ట్రంప్ అల్లుడు జరెడ్ కుష్నర్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ .. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘలిబఫ్, విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అర్గచీలు చర్చల్లో పాల్గొననున్నారు.
అమెరికాతో ఆటలు ఆడాలనుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ను జేడీ వాన్స్ హెచ్చరించారు. పశ్చిమాసియాలో యుద్ధానికి విరామం ప్రకటించినందున శాంతి చర్చల కోసం పాకిస్థాన్కు వెళ్లే ముందు వాన్స్ మీడియాతో మాట్లాడుతూ అమెరికా వైఖరిని స్పష్టం చేశారు. తమ అధ్యక్షుడి ఆదేశాల మేరుకు దౌత్యపరమైన చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ సమయంలో ఇరాన్ తమతో ఆటలు ఆడాలని చూస్తే సహించబోమని వాన్స్ స్పష్టం చేశారు.

‘టెహ్రాన్తో దౌత్యపరమైన చర్చల విషయమై అధ్యక్షుడు ట్రంప్ మాకు కీలకమైన సూచనలు చేశారు. ఆయన మాట ప్రకారం ఇరాన్ విశ్వసనీయతతో చర్చలు జరిపితే మేము సానుకూలంగా స్పందిస్తాం. అలా కాకుండా వారు మాతో ఆటలు ఆడాలనుకుంటే మాత్రం చర్చలకు వచ్చిన బృందం వారి మాట అస్సలు వినదు. అయితే.. మేము మాత్రం ఇరుదేశాల ప్రతినిధుల మధ్య చర్చలు సానుకూలంగా జరగడానికి ప్రయత్నిస్తాం’ అని వాన్స్ వెల్లడించారు.