సినీతారలంటేనే.. లగ్జరీకి కేరాఫ్ అడ్రస్! వాళ్లు వాడే ప్రతి వస్తువూ ఖరీదైనదే! అయితే, సంపద, హోదాను ప్రదర్శించాలనే తపనతోనే సినీతారలు ఇలా లక్షలు ఖర్చు చేస్తుంటారట. ఇష్టం లేకపోయినా విలాసవంతమైన బ్రాండ్లను కొనుగోలు చేయాల్సి వస్తుందట. బాలీవుడ్ సీనియర్ నటి సమీరా రెడ్డి.. పంచుకున్న ముచ్చట్లివి. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. బాలీవుడ్ హీరోయిన్ల లగ్జరీ లైఫ్స్టయిల్ గురించిన సంగతులను పంచుకున్నది. “కెరీర్ మొదట్లో ఇక్కడ నిలదొక్కుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ట్రెండీ లుక్లో కనిపించడం కోసం విలాసవంతమైన బ్రాండ్ల వస్తువులు కొనుగోలు చేశా. ఇందుకోసం భారీగా ఖర్చు చేశా. ఎందుకంటే.. మనం కూడా బాలీవుడ్ వాతావరణానికి తగినట్లుగా కనిపించాలి కదా! ఈక్రమంలో ఎంతో ఒత్తిడికి గురయ్యా!” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది సమీరారెడ్డి.
ఇక పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో తన దగ్గర అన్నీ లేటెస్ట్ బ్యాగులే ఉండాలని అనుకునేదట సమీరా. బాలీవుడ్ కల్చర్కు తగినట్లుగా ఉండాలనే ఒత్తిడిలో.. లక్షలు ఖర్చుపెట్టి బ్రాండెడ్ బ్యాగులు కొనేదట. ఎందుకంటే తాను ఓ స్థాయికి చేరుకున్నానని అందరూ అనుకోవాలనేది ఆమె కోరికగా ఉండేదట. “1.7 లక్షలు పెట్టి లూయిస్ విట్టన్ టోట్ బ్యాగ్ కొన్నా. అప్పట్లో ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చే హీరోయిన్లపైనే అందరి ఫోకస్ ఉండేది. అక్కడ మనం ఎలా కనిపించామన్న దాన్నిబట్టే.. ఎదుటివారు మనల్ని అంచనా వేసేవారు. అప్పటి టాప్ హీరోయిన్స్ అందరూ ఈ భారీ బ్యాగులను భుజానికి తగిలించుకుని ఎయిర్పోర్ట్లో కనిపించేవారు.
దాంతో నాకూ ఒక ఎయిర్పోర్ట్ లుక్ ఉండాలని అనుకున్నా. నా దగ్గర ఏముందో చూపించాలనే.. లక్షలు ఖర్చు చేసి లగ్జరీ బ్యాగ్లను కొన్నా. వీటికి బదులు గోల్డ్ బిస్కెట్ కొనుగోలు చేసుంటే బాగుండేది!” అంటూ చెప్పుకొచ్చింది. అయితే, అదంతా గతకాలమనీ, ఇప్పుడు పూర్తిగా ఆర్గానిక్ దుస్తులకే అలవాటు పడిపోయాననీ అంటున్నది. తన దగ్గర ఎంతో హుందాగా కనిపించే బట్టలున్నా.. వాటిని పెద్దగా ముట్టుకోవడం లేదని చెప్పింది. గోవాకు మకాం మార్చినప్పటి నుంచే.. ఫాస్ట్ ఫ్యాషన్ పక్కనపెట్టి, తన దగ్గరున్న దుస్తులనే రకరకాలుగా కలిపి ధరిస్తున్నానని వెల్లడించింది. ప్రస్తుతం సమీరా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక సమీరా వృత్తిగత జీవితం విషయానికి వస్తే.. రాజమండ్రికి చెందిన సమీరా రెడ్డి, టాలీవుడ్తోపాటూ బాలీవుడ్లోనూ రాణించింది. 2002లో వచ్చిన ‘మైనే దిల్ తుఝ్కో దియా’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 2005లో జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘నరసింహుడు’తో తెలుగువారిని పలకరించింది. ఆ తర్వాత జై చిరంజీవా, అశోక్ చిత్రాలతో మెప్పించింది. కానీ, తెలుగులో అనుకున్న సక్సెస్ దక్కకపోవడంతో.. పూర్తిగా హిందీ చిత్రాలకే పరిమితమైంది. ఆ తర్వాత బెంగాలీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ నటించింది. 2013లో వచ్చిన ‘వరదనాయక’ అనే కన్నడ సినిమాలో చివరిసారిగా తెరపై కనిపించింది సమీరా రెడ్డి. 2014లో అక్షయ్ వర్దేను వివాహం చేసుకున్న తర్వాత.. పరిశ్రమకు పూర్తిగా దూరమైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. ఫిట్నెస్, వెయిట్ లాస్ విషయాలను అభిమానులతో పంచుకుంటున్నది.