దేశానికే తలమానికం తెలంగాణ
కరోనా కష్టకాలంలోనూ ఆగని సంక్షేమం
కేసీఆర్ పాలనలో మనం ఉండడం అదృష్టం
త్వరలో కొత్త పింఛన్లు
దళితబంధుతో దళితుల జీవితాల్లో వెలుగులు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
తొర్రూరు, రాయపర్తి, పాలకుర్తిలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ
తొర్రూరు/రాయపర్తి/పాలకుర్తి రూరల్, జూలై 26: ‘ఇది పథకాల ప్రభుత్వం.. కరోనా కష్టాలతో రాష్ట్ర ఖజానాకు రాబడి తగ్గినా సంక్షేమ పథకాలను ఆపలేదు.. అందరు మెచ్చే పాలననందిస్తూ తెలంగాణ దేశానికే తలమానికంగా నిలిచింది.. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మనం ఉండడం అదృష్టంగా భావిస్తున్న’అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం ఆయన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో తొర్రూరు, పెద్దవంగర మండలాల్లో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అలాగే వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో, జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేశారు.
ఆయా కార్యక్రమాల్లో ఎర్రబెల్లి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో ఏడేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రతి ఒక్కరూ ఆలోచించి ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా కూడా తెలంగాణ తరహా పథకాలు అమలు కావడంలేదన్నారు. కేసీఆర్ ఏది చేసినా శాశ్వతం ప్రాతిపదికన అభివృద్ధి జరుగాలని చూస్తారని, అదే దూరదృష్టితో ‘దళిత బంధు’ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. సొంత స్థలం కలిగి ఉన్న నిరుపేదలకు కోరుకున్న చోట డబుల్బెడ్రూం ఇల్లు కట్టుకునేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించారని, త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఇప్పటి వరకు లక్షా 32వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని, కొత్తగా మరో 50వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తున్న ట్లు తెలిపారు. రెండేళ్ల పల్లెప్రగతితో సీజనల్ వ్యాధులు పల్లెలు, తండాల దరిదాపుల్లో లేకుండా పోయాయని చెప్పారు. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగానే చారిత్రక రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించి, ప్రపంచస్థాయి కీర్తిని గడించిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్రమంతటా 4లక్షల 16వేల నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
57ఏళ్లు నిండిన వారికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. తొర్రూరు మండలంలో 454, పెద్దవంగర మండలంలో 257 మందికి, రాయపర్తిలో 374 మందికి, పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో 1341మందికి నూతన రేషన్ కార్డులు అందజేశారు. తొర్రూరులో కలెక్టర్ అభిలాష అభినవ్, ఆర్డీవో రమేశ్, తొర్రూరు, పెద్దవంగర మండలాల ఎంపీపీలు చిన్నఅంజయ్య, రాజేశ్వరి, జడ్పీటీసీలు శ్రీనివాస్, శ్రీరాం జ్యోతిర్మయి, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, రాయపర్తిలో కలెక్టర్ ముండ్రాతి హరిత, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమారస్వామి, మండల అధ్యక్షుడు నర్సింహ్మానాయక్, జిల్లా నాయకుడు సుధీర్రెడ్డి, పాలకుర్తిలో కలెక్టర్ నిఖిల, అదనపు కలెక్టర్ భాస్కర్రావు, ఆర్డీవో కృష్ణవేణి, తహసీల్దార్లు విజయ్భాస్కర్, స్వప్న, డీఎస్వో రోజారాణి, డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్రెడ్డి, ఎంపీపీ నల్లానాగిరెడ్డి, బస్వ సావిత్రీమల్లేశం, జ్యోతి, జడ్పీటీసీలు శ్రీనివాసరావు, భార్గవి, సత్తమ్మ, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్, మండల అధ్యక్షుడు నవీన్, దయాకర్, తదితరులు పాల్గొన్నారు.