కొవిడ్ నిబంధనల నడుమ ప్రత్యక్ష తరగతులు
జిల్లాలో 1,025 స్కూళ్లు.. 1,26,049 మంది విద్యార్థులు
బడుల ప్రారంభంపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల హర్షం
వరంగల్, ఆగస్టు 23(నమస్తేతెలంగాణ) : కొవిడ్ కారణంగా మూతపడ్డ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సెప్టెంబర్ 1నుంచి తెరుచుకోనున్నాయి. కరోనా కారణంగా అస్తవ్యస్తమైన విద్యావ్యవస్థను గాడినపెట్డడంతో పాటు, విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన కారణంగా ప్రభుత్వం పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నది. అంగన్వాడీ కేంద్రాలు సహా ఒకటి నుంచి పీజీ వరకు విద్యాసంస్థలు మొదలుకానున్నాయి. జిల్లాలో మొత్తం 1,025 పాఠశాలల్లో 1,26,049 మంది విద్యార్థులు ఉండగా సర్కారు నిర్ణయంతో ఇటు ఉపాధ్యాయులు, అటు తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
సెప్టెంబరు ఒకటి నుంచి పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆన్లైన్ క్లాసులకు తెరపడనుంది. ఆఫ్లైన్ క్లాస్లు నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు సన్నాహాలు చేపట్టారు. కరోనా మహమ్మారితో గత విద్యా సంవత్సరంలో మూసివేసిన పాఠశాలలను ప్రభుత్వం ఫిబ్రవరిలో ఓపెన్ చేసింది. తొలుత 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు, ఆ తర్వాత 6, 7 తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించింది. కరోనా సెకండ్ వేవ్తో ఏప్రిల్ 26వ తేదీ నుంచి తిరిగి పాఠశాలలను మూసివేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జూలై ఒకటి నుంచి పాఠశాలలు ప్రారంభించకుండా విద్యార్థులకు అన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నది. ఉపాధ్యాయులు ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు బోధిస్తున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. తాజాగా సోమవారం ప్రభుత్వం సెప్టెంబర్ ఒకటి నుంచి పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఈమేరకు ఉపాధ్యాయులకు సమాచారమిచ్చారు. ఆయా ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. మంగళవారం మండల, డివిజన్ స్థాయి అధికారులతో సమావేశం కావడానికి విద్యాశాఖ జిల్లా అధికారులు నిర్ణయించారు. పాఠశాలల ప్రారంభంపై మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, విద్యాశాఖ జిల్లా అధికారులతో మాట్లాడుతారని తెలిసింది.
జిల్లాలో 1,025 పాఠశాలలు..
జిల్లాలో మొత్తం 1,025 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1,26,049 మంది విద్యార్థులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థల పరిధిలోనివి, ప్రైవేట్ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలు 479, ప్రాథమికోన్నత పాఠశాలలు 84, ఉన్నత పాఠశాలలు 706 ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. వీటి తో పాటు కేజీబీవీలు 10, మోడల్ స్కూళ్లు 6 ఉన్నా యి. మొత్తం 722 ప్రభుత్వ పాఠశాలల్లో 45,811 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలలు 257 ఉంటే వీటిలో 70,824 మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నవోదయ పాఠశాల లో 508 మంది విద్యార్థులు ఉన్నారు. గిరిజన సంక్షే మ శాఖ, టీడబ్ల్యూ ఆశ్రమ పాఠశాలలు, టీడబ్ల్యూర్ఐఈఎస్, టీఎస్ఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్, టీఎస్ఆర్ఈఐఎస్, బీసీడబ్ల్యూఆర్ఈఎస్, మదర్సా, యూఆర్ఎ స్ పాఠశాలల్లోనూ విద్యార్థులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. మొత్తం 1,26,049 మంది విద్యార్థుల్లో ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు 18,248, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులు 14,386, ఉన్నత పాఠశాలల విద్యార్థులు 93,415 మంది ఉన్నట్లు తెలిపారు. ఒకటి నుంచి ప్రారంభించాలనే ప్రభుత్వ నిర్ణయంతో పాఠశాలలన్నింటిలో తరగతులు నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.