Jana Jatara Sabha | రాజన్న సిరిసిల్ల, మే 3 (నమస్తే తెలంగాణ)/ వెల్గటూర్: జనజాతర సభలు తుస్సుమన్నాయి. జనం లేక కాంగ్రెస్ సభలు వెలవెలబోయాయి. సీఎం సమయానికి రాకపోవటంతో జనం అసహనాన్ని వ్యక్తం చేశారు. మిట్టమధ్యాహ్నం మండుటెండల్లో సభలు ఏర్పాటు చేయగా, అనుకున్న సమయం కన్నా సీఎం ఆలస్యంగా వచ్చారు. దీంతో సభలకు వచ్చిన వాళ్లంతా ఇంటిదారి పట్టారు. సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతుండగా ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి, సిరిసిల్లలోని మొదటి బైపాస్రోడ్డులో ఉన్న మైదానంలో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ మీటింగ్లు అట్టర్ప్లాఫ్ అయ్యాయి. రాజారాంపల్లి సభకు సీఎం మధ్యాహ్నం 2.30 రావాల్సి ఉండగా, సాయంత్రం 6.30 గంటలకు వచ్చారు. అయితే, మధ్యాహ్నం 12 గంటలకే వచ్చిన జనాలు మీటింగ్ ఆలస్యం కావటంతో విసిగి వేసారి వెనుతిరిగి వెళ్లిపోయారు. సిరిసిల్లలో అయితే పది నిమిషాల్లో సీఎం వస్తున్నారని, కూర్చోవాలని నేతలు చెప్పినా.. జనం, కార్యకర్తలు వారి విజ్ఞప్తులను పట్టించుకోకపోవటం గమనార్హం. సభకు వచ్చిన జనంలో 95 శాతం వెళ్లిపోయారు. రాత్రి 8.48 గంటలకు సీఎం రేవంత్రెడ్డి సభాస్థలికి చేరుకున్నారు. ఆయన ప్రసంగిస్తుండగా సభలో అన్నీ ఖాళీ కుర్చీలే కనిపించాయి. బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న సిరిసిల్లలో పెద్దఎత్తున జన సమీకరించి సక్సెస్ చేద్దామనుకున్న నేతలు తీవ్రనిరాశ, నిస్పృహకు లోనయ్యారు.
బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ రద్దుకే: సీఎం
బీజేపీకి వేసే ప్రతి ఓటు దళితులకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేయడానికేనని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. రెండు సభల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. 400 ఎంపీ సీట్ల కోసం మోదీ చూస్తున్నారని, అలా గెలిపిస్తే మోడీ అధికారంలోకి రాగానే రిజర్వేషన్లు రద్దు చేస్తారని ఆరోపించారు. రాష్ర్టానికి మోదీ ఏమీ ఇవ్వలేదని గాడిద గుడ్డును సీఎం ప్రదర్శించారు. విభజన చట్టంలోని హామీలను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదని, పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఏర్పాటుపై మోదీ అవమానకరంగా మాట్లాడారని మండిపడ్డారు. ప్రాజెక్టులకు జాతీయ హోదా ప్రకటించని బీజేపీకి ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు.
ఎండపల్లి స్టేజీ వద్ద ప్రమాదం.. ఇద్దరికి గాయాలు
రాజారాంపల్లిలో సీఎం రేవంత్రెడ్డి సభకు వచ్చి తిరిగివెళ్తున్న వారిలో ఇద్దరు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ధర్మపురి మండలంలోని జైనకు చెందిన నలుగురు తమ ఆటోలో వెళ్తుండగా, ఎండపల్లి స్టేజీ వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. దీంతో జైనకు చెందిన సుధీర్, సత్యానికి తీవ్ర గాయాలు కావటంతో జగిత్యాల దవాఖానకు తరలించారు.
సీఎం వచ్చినా..కానరాని స్పందన
ఇదే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని సిరిసిల్ల పట్టణంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభకు సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి వచ్చినా ప్రజల్లో స్పందన కరువైంది. ‘పది నిమిషాల్లో సీఎం వస్తున్నారు.. అంతా కూర్చోవాలి’ అని వేదికపై నుంచి నేతలు చేసిన విజ్ఞప్తులను కూడా పట్టించుకోకుండా వచ్చిన కార్యకర్తలు సైతం లేచి వెళ్లిపోవడం కనిపించింది. సుమారు 2వేల మంది కూడా లేకపోవడంతో రేవంత్ వచ్చే సమయానికి ఇక్కడి ఆరుగ్యాలరీల్లో నాలుగు పూర్తిగా ఖాళీ అయ్యాయి. రాత్రి 8.48 గంటలకు రేవంత్రెడ్డి చేరుకొని ప్రసంగిస్తుండగా 95శాతం ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి.