హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది ప్రథమార్థంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మంచి వృద్ధిని నమోదు చేసింది. తొలి 6 నెలల్లో సుమారు రూ.5,000 కోట్ల వరకు పెట్టుబడులు వచ్చినట్టు అంచనా. హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అదే స్థాయిలో నివాస గృహాలు, వాణిజ్య భవనాలకూ గిరాకీ పెరుగుతున్నది. కరోనా నేపథ్యంలో ఈసారి ఆఫీస్ స్పేస్ తరహాలో కొత్తగా ‘ల్యాబ్ స్పేస్’ ట్రెండ్ మొదలైంది. ఇప్పటికే వ్యాక్సిన్ల రాజధానిగా, దేశంలోనే అతిపెద్ద ఫార్మా కేంద్రంగా వెలుగొందుతున్న హైదరాబాద్లో త్వరలో ఫార్మాసిటీ కూడా ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రియాల్టీ రంగంలోకి పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది తొలి 3 నెలల్లో హైదరాబాద్ సుమారు రూ.2,800 కోట్ల పెట్టుబడులను సాధించింది. ఆ 3 నెలల్లో దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో ఇది 42 శాతం. తర్వాతి 3 నెలల్లో లాక్డౌన్ సమయంలోనూ సుమారు రూ.1,500 కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చినట్టు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.
ఇండ్ల అమ్మకాల్లోనూ వృద్ధి
ఈ ఏడాది ప్రథమార్ధంలో ఇండ్ల అమ్మకాలు కూడా పెరిగాయని, గతేడాది తొలి 6 నెలలతో పోల్చితే సుమారు 62 శాతం అధికంగా అమ్మకాలు జరిగాయని జేఎల్ఎల్ రీసెర్చ్ వెల్లడించింది. కొత్త ప్రాజెక్టుల్లోనూ నివాసగృహాల వాటా మూడింట ఒకవంతు ఉన్నట్టు స్పష్టం చేసింది. ఈ ఏడాది తొలి 6 నెలల్లో సుమారు 61 వేల యూనిట్ల నిర్మాణం ప్రారంభం కాగా.. ఇందులో సుమారు 20 వేల యూనిట్లు నివాస గృహాలని వెల్లడించింది. మరోవైపు హైదరాబాద్లో గోదాముల నిర్మాణం కూడా పెరిగింది. తొలి 6 నెలల్లో దాదాపు 24 లక్షల చదరపు అడుగుల స్థలాలు అమ్ముడవగా.. ఇందులో 54 శాతం స్థలాలను ఈ-కామర్స్ కంపెనీలే కొనుగోలు చేశాయి.