పల్లె ప్రగతి, హరితహారంపై ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్ : తెలంగాణలో జులై 1వ తేదీ నుంచి చేపట్టనున్న పల్లె ప్రగతి, హరితహారంపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. జులై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభించాలన్నారు. నిర్దేశించిన ఏ పనీ పెండింగ్లోఉండేందుకు వీల్లేదన్నారు. పంచాయతీరాజ్ శాఖకు ప్రభుత్వం బాగా సహకరిస్తోంది. పనులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయో సమీక్ష చేసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇచ్చి నాటించాలి.
ఎన్నడూ లేని విధంగా పంటలతో రాష్ర్టం ధాన్యాగారంగా మారింది. ఈ క్రమంలో రాష్ర్టానికి అదనపు రైస్ మిల్లులు అవసరం ఉందన్నారు. రైస్ మిల్లుల సంఖ్యను పెంచి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. 250 ఎకరాల్లో ఒక్కో ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ ఏర్పాటు చేయాలన్నారు. సెజ్ల చుట్టూ బఫర్ జోన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బఫర్ జోన్ల పరిధిలో లేఔట్లు, నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దన్నారు.
కల్తీ విత్తనాల అమ్మకాల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. వ్యవసాయ శాఖ, పోలీసులు కల్తీ విత్తనాలను అరికట్టాలని ఆదేశించారు. కలెక్టర్లు, జిల్లాల ఉన్నతాధికారులు విశేష అధికారాలు వాడాలన్నారు. గ్రామాల్లో విద్యుత్ సమస్య పరిష్కారానికి పవర్ డే పాటించాలి. ప్రజలను చైతన్యపరిచి శ్రమదానంలో పాల్గొనేలా చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.
ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), 2019 బ్యాచ్ ఐఏఎస్ లు, డీఎఫ్ఓలు, కన్జర్వేటర్లు, డీపీవోలు, డీఆర్ డీవోలు, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖల అధికారులు హాజరయ్యారు.